నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కోకాపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా భార్య, భర్తపై కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. మృతుడిని కృష్ణజ్యోతి బోరాగా గుర్తించగా, నిందితురాలు భార్య భారాకా బోరా అని పోలీసులు తెలిపారు. ఇద్దరూ అస్సాం రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు.
స్థానికుల కథనం ప్రకారం.. కృష్ణజ్యోతి బోరా, భారాకా బోరా దంపతుల మధ్య వివాదం జరిగింది. ఇరువురి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో భార్య భారాకా బోరా కత్తితో భర్తపై దాడి చేయగా, తీవ్రంగా గాయపడిన కృష్ణజ్యోతి బోరా రక్తపు మడుగులో పడిపోయారు. కేకలు విన్న స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కృష్ణజ్యోతి బోరా మృతి చెందాడు.
సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో కృష్ణజ్యోతి గత కొంతకాలంగా భార్యను వేధిస్తున్నట్లు తెలిసింది. ఈ వేధింపులే ఘటనకు దారితీశాయని స్థానికులు పేర్కొన్నారు.