Monday, September 22, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌పై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి

ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌పై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌ మార్పు, తదితర సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులతో మాట్లాడకుండా, గ్రామ సభలు నిర్వహించకుండా, భూ సేకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. బలవంతంగా భూములను తీసుకో వాలని ప్రయత్నం చేస్తే రైతుల నుండి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఎనిమిది జిల్లాలు, 33 మండలాలు, 163 గ్రామాల పరిధిలో రీజనల్‌ రింగ్‌రోడ్డును 100 మీటర్ల వెడల్పుతో నిర్మించాలని హెచ్‌ఎండిఏ నోటిఫికేష న్‌ను ఇచ్చిందని తెలిపారు. దీనికోసం భూములు తీసుకుంటామని ప్రకటించారని గుర్తు చేశారు. రైల్వే ట్రాక్‌ కొరకు మరొక 40 అడుగులవెడల్పుతో రోడ్డును పెంచుతా మని ప్రభుత్వం చెబుతున్నదన్నారు.

మొదటి అలైన్‌మెంట్‌ మార్చి రెండోసారి అలైన్‌మెంట్‌ చేశారనీ, ఇప్పుడు మూడో అలైన్‌మెంట్‌ను తయారుచేసి విడుదల చేశారని పేర్కొన్నారు. ఇందులో రాజకీయ అండదండలు, డబ్బు, పలుకుబడి ఉన్న వారి భూముల్లోకి రోడ్డు మార్గం లేకుండా చూస్తున్నారని ఆరోపించారు. ఎకరం, రెండెకరాలు, మూడెకరాలున్న చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన భూములున్న ప్రాంతాన్నే రింగ్‌రోడ్డు కోసం తీసుకుంటున్నట్టుగా ఆరోపణలొ స్తున్నాయని తెలిపారు. ఆ భూములను నమ్ముకునే బతుకుతు న్నామన్న రైతులు.. తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రింగ్‌రోడ్డు అలైన్‌మెంటును ఎందుకు మార్చుతున్నదో స్పష్టతని వ్వాలని డిమాండ్‌ చేశారు. కేవలం కొద్దిమంది పెద్దల ప్రయోజనాల కోసం సామాన్యమైన చిన్న రైతుల జీవితాలను దెబ్బతీసేటువంటి వైఖరిని మానుకోవా లని సూచించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ భూబాధితుల సమస్యలపై మంగళవారం హైదరాబాద్‌లో ఆయా జిల్లాల, మండలాల బాధ్యులతో సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -