నవతెలంగాణ-హైదరాబాద్: సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ(SIR) తెలంగాణలో ముమ్మరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇంటింటికి ఫారాల పంపిణీ నెమ్మదిగా సాగుతోంది. ఈక్రమంలో సర్ ప్రక్రియ గడువును పెంచాలని ప్రతిపక్షాలతో పాటు పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తెలంగాణలో వెలువడే తుది జాబితా ప్రక్రియ గడువును పెంచింది. రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం చేసిన అభ్యర్థన మేరకు సవరించిన షెడ్యూల్ వెల్లడించింది.
సర్ సర్వేలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (BLOs) ఇంటింటికీ వెళ్లి చేసే పరిశీలన జూన్ 25 నుండి ఆగస్టు 3 వరకు కొనసాగుతుంది. అలాగే, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఆగస్టు 3 నాటికి పూర్తవుతుంది. ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 10న విడుదల కానుంది. ఓటర్ జాబితాలో అభ్యంతరాలు లేదా క్లెయిమ్లను ఆగస్టు 10 నుండి సెప్టెంబర్ 9 వరకు దాఖలు చేయవచ్చు. ఆ తర్వాత అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ ఆగస్టు 10 నుండి అక్టోబర్ 8 వరకు నిర్వహించబడుతుంది. తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 12న విడుదల చేయనున్నట్లు ఈసీ పేర్కొంది.
అయితే అంతకుముందు జూన్ 25 నుండి జూలై 24 వరకు తెలంగాణలో బూత్ స్థాయి అధికారి (BLO) పర్యటనల షెడ్యూల్ ప్రకటించారు. జూలై 24 నాటికి పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను పూర్తి చేయాల్సి ఉంది. ముసాయిదా ఓటర్ల జాబితాను జూలై 31న ప్రచురించాల్సి ఉండగా, ఆ తర్వాత జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు మరియు అభ్యంతరాలను దాఖలు చేసే గడువు కొనసాగింది. నోటీసుల దశ మరియు క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారం సెప్టెంబర్ 28 వరకు కొనసాగనుండగా, తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 1న ప్రచురించాల్సి ఉంది. తాజా ఉత్తర్వులతో తెలంగాణ సర్ ప్రక్రియ గడువును పొడిగించింది.



