Monday, October 6, 2025
E-PAPER
Homeజాతీయంలడఖ్‌లో ఆ హత్యలపై స్వతంత్ర విచారణ జరగాలి

లడఖ్‌లో ఆ హత్యలపై స్వతంత్ర విచారణ జరగాలి

- Advertisement -

లేదంటే జైల్లోనే ఉంటా : వాంగ్‌చుక్‌
నేడు సుప్రీంలో అరెస్టుపై విచారణ

జోధ్‌పూర్‌: లడఖ్‌ కు రాష్ట్ర హౌదా డిమాండ్‌ చేస్తూ ఇటీవల లేహ్ ప్రాంతంలో అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి లడఖ్‌ ఉద్యమ నేత సోనమ్‌ వాంగ్‌చుక్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఆయన జైలు నుంచి ఓ సందేశాన్ని పంపారు. ఘర్షణల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని, లేదంటే తాను జైలులోనే ఉండిపోయేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. వాంగ్‌చుక్‌ ప్రస్తుతం జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నారు. సోదరుడు కాత్సేతాన్‌ డోర్జే లేతో పాటు న్యాయవాది ముస్తఫా హాజీలు ఆయన్ను కలిసిన సందర్భంగా ఈ సందేశాన్ని పంపారు. ‘నేను శారీరకంగా, మానసికంగా బాగానే ఉన్నాను. నా కోసం ప్రార్థిస్తున్న వారికి ధన్యవాదాలు. ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలి. నలుగురు వ్యక్తుల హత్యలకు సంబంధించి స్వతంత్ర న్యాయ విచారణ జరగాలి. లేదంటే నేను జైలులోనే ఉండేందుకు సిద్ధంగా ఉన్నాను.

లద్దాఖ్‌కు రాష్ట్ర హౌదా కోసం ప్రజలు, లేహ్ అపెక్స్‌ బాడీ(ఎల్‌ఏబీ), కార్గిల్‌ డెమొక్రటిక్‌ అలయెన్స్‌ (ఏడీఏ) చేస్తున్న డిమాండ్‌లకు మద్దతిస్తున్నా’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాంతి, ఐక్యతను కాపాడుకోవాలన్నారు. అహింసా మార్గంలోనే మన పోరాటాన్ని శాంతియుతంగా కొనసాగించాలని ప్రజలకు సూచించారు. లేహ్ లో ఇటీవల జరిగిన హింసాత్మక అల్లర్లలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 90 మందికి పైగా గాయపడ్డారు. ఉద్యమకారులు సోనమ్‌ వాంగ్‌చుక్‌ పిలుపుతోనే ఈ ఆందోళనలు జరిగాయని కేంద్రం వెల్లడించింది. అనంతరం పోలీసులు ఆయనను జాతీయ భద్రత చట్టం కింద అరెస్టు చేశారు. ఇలా అరెస్టయిన వ్యక్తిని విచారణ చేయకుండా 12 నెలల పాటు నిర్బంధించేందుకు చట్టం అనుమతిస్తుంది. ఈ క్రమంలోనే తన భర్తను విడుదల చేయాలంటూ వాంగ్‌చుక్‌ భార్య గీతాంజలి జే ఆంగ్మో సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -