నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్తో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో తీసిన ఒక ఫొటో ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆ ఫొటోలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సీటు బెల్టు ధరించి ఉండగా, ప్రధాని మోడీ మాత్రం ఎలాంటి సీటు బెల్టు పెట్టుకోకుండా కెమెరాకు పోజులిస్తూ కనిపించారు.
ఈ ఫొటో ఇంటర్నెట్లో వేగంగా వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు భద్రతా నియమాలను స్వయంగా ప్రధానే ఉల్లంఘించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మన దేశానికి అతిథిగా వచ్చిన బ్రిటన్ ప్రధాని నిబంధనలు పాటిస్తుంటే, మన ప్రధాని వాటిని విస్మరించడం సరైన సందేశం కాదని కామెంట్లు పెడుతున్నారు. దేశ ప్రధానే ఇలా చేస్తే సాధారణ పౌరులు నిబంధనలను ఎలా గౌరవిస్తారంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.