ఏపీతో పాటు పది రాష్ట్రాల్లో 24 స్థానాలకు ఎన్నిక
ఏపిలో నాలుగు స్థానాలు ఖాళీ
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో పది రాష్ట్రాల్లోని 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దేశంలోని 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయని పేర్కొంది. జూన్ 1న ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపింది. 8 వరకు నామినేషన్ల స్వీకరణ, 9న నామినేషన్ల పరిశీలన, 11న ఉపసంహరణకు అవకాశం ఉంటుందని తెలిపింది. జూన్ 18న ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాన్ని ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో నాలుగు, గుజరాత్లో నాలుగు, కర్ణాటకలో నాలుగు, మధ్యప్రదేశ్లో మూడు, రాజస్థాన్లో మూడు, జార్ఖండ్లో రెండు స్థానాలతో పాటు మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ప్రదేశ్, మిజోరంలో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
ఏపీలో పదవికాలం ముగియనున్న ఎంపీలు వీరే
ఆంధ్రప్రదేశ్లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. జూన్ 21తో వైసీపీ నుంచి ఎంపికైన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటు టీడీపీ నుంచి ఎంపికైన సానా సతీష్ పదవీకాలం ముగియనుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమిలోని పార్టీలకు 164 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. దాంతో ఈ నాలుగు రాజ్యసభ స్థానాలు ఆయా పార్టీలు సొంతం చేసుకునే అవకాశం ఉంది.
ఎన్నికల షెడ్యూల్ ఇదే
నోటిఫికేషన్ జారీ : జూన్ 1 (సోమవారం)
నామినేషన్ల స్వీకరణకు గడువు : జూన్ 8 (సోమవారం)
నామినేషన్ల పరిశీలన : జూన్ 9 (మంగళవారం)
నామినేషన్ల ఉపసంహరణకు గడువు : జూన్ 11 (గురువారం)
పోలింగ్ : జూన్ 18 (గురువారం) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి : జూన్ 18 (గురువారం) సాయంత్రం 5 గంటలకు



