నడిరోడ్డుపై మహిళను దారుణంగా కొట్టిన వ్యక్తి.. వీడియో వైరల్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : జనం చుట్టూ గుమిగూడి చూస్తుండగా మహిళను ఒక వ్యక్తి దారుణంగా కొట్టాడు. మరో వ్యక్తిపై కూడా అక్కడున్న వారు దాడి చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ‘వీధి తీర్పు’పై విమర్శలు వెల్లువెత్తాయి. పశ్చిమ బెంగాల్‌ ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని చోప్రాలో ఈ సంఘటన జరిగింది. కొంతమంది జనం గుంపుగా చూట్టూ చేరారు. ఒక వ్యక్తి కర్రల కట్టతో మహిళను పదేపదే కొట్టాడు. దీంతో బాధతో ఆమె అరిచింది. అయినప్పటికీ ఆ వ్యక్తి కొట్టడం ఆపలేదు. కింద కూర్చొన్న వ్యక్తిని కూడా అతడు కొట్టాడు. గుంపులోని వారంతా కళ్లప్పగించి దీనిని చూశారు. దాడిని ఆపడానికి ప్రయత్నించకపోగా కొట్టిన వ్యక్తికి అండగా నిలిచారు. మరో వ్యక్తి కూడా ఆ మహిళ జట్టుపట్టుకుని కాళ్లతో తన్నాడు. అయితే ఆ మహిళ, ఒక వ్యక్తిని బహిరంగంగా ఎందుకు కొట్టారో అన్నది తెలియలేదు. కాగా, ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ‘ పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పాలనకు సంబంధించిన వికృత రూపం ఇది. ఒక మహిళను నిర్దాక్షిణ్యంగా కొట్టారు. వీడియోలోని వ్యక్తి జేసీబీగా పాపురల్‌ అయిన తాజెముల్. ‘ఇన్సాఫ్’ ద్వారా సత్వర న్యాయం అందించడంలో ప్రసిద్ధి. చోప్రా ఎమ్మెల్యే హమీదుర్ రెహమాన్‌కు సన్నిహితుడు’ అని బీజేపీ ఐటీ సెల్‌ ఇన్‌చార్జ్‌ అమిత్ మాల్వియా ఎక్స్‌లో ఆరోపించారు. మరోవైపు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ మహ్మద్‌ సలీం కూడా ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజాకోర్టు కంటే ఇది దారుణంగా ఉందని విమర్శించారు. అయితే ఈ సంఘటనపై టీఎంసీ ఇంకా స్పందించలేదు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love