4న ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జులై 4వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబుకు ఇదే తొలి ఢిల్లీ పర్యటన. సీఎం చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి మోడీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసే అవకాశముంది. ఏపీకి కేంద్రం నుంచి సాయంపై చర్చించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ను జులై 22న ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, ఏపీకి తగిన రీతిలో కేటాయింపులు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్రం పెద్దలను కోరనున్నారు. విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలు కూడా చంద్రబాబు ప్రస్తావించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఎన్డీయే భాగస్వామి నితీశ్ కుమార్ బీహార్ కు ప్రత్యేక హోదా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, ప్రధానితో చంద్రబాబు భేటీ ఆసక్తి కలిగిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

Spread the love