నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం ది నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల మేరకు ఆన్ లైన్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ది నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ కమ్మర్ పల్లి బ్రాంచ్ మేనేజర్ కే.శ్రీనివాస్ సదస్సుకు హాజరైన వారికి బ్యాంక్ సేవలపై అవగాహన కల్పించారు. బ్యాంకులో ఖాతా ఉన్న వారు తప్పనిసరిగా కేవైసీని అప్డేట్ చేయించుకోవాలని సూచించారు. ప్రజలు ఆన్ లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
బ్యాంకుల పేరు చెప్పి ఎవరైనా ఓటీపీలు అడిగితే చెప్పొద్దన్నారు. ది నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ద్వారా ప్రజలకు, రైతులకు అందించే సేవలను వివరించారు. తమ బ్యాంకులో బంగారంపై అతి తక్కువ వడ్డీకే రుణాలు అందించడం జరుగుతుందన్నారు.బ్యాంక్ యొక్క సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, పంచాయతీ కార్యదర్శి గంగా జమున, వార్డు సభ్యులు వేములవాడ జగదీశ్, అసిస్టెంట్ మేనేజర్ ఎస్.భార్గవ, బ్యాంకు అప్రైజర్ అకోజీ అంకిత్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.



