– పరిమితి మించితే రూ.23 భారం
ముంబయి : బ్యాకింగ్ వినియోగదారులపై మరో భారం పడనుంది. నగదు ఉపసంహరణ లేదా ఇతర సేవల కోసం ఇక నుంచి పరిమితి మించి ఏటీఎం వినియోగిస్తే ఒకొక్క లావాదేవీపై రూ.23 చొప్పున భారం పడనుంది. ఈ మేరకు వినియోగదారులపై ఛార్జీల బాదుడుకు బ్యాంకులు ప్రతిపాదించగా అందుకు భారత రిజర్వుబ్యాంకు అనుమతులిచ్చింది. వచ్చే మే నెల 1వ తేదీ నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. సాధారణంగా కస్టమర్లకు ఒక నెలలో సొంత బ్యాంకు ఏటీఎం నుంచి ఐదు లావాదేవీలు (నగదు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్) ఉచితంగా పొందొచ్చు. అదే వేరే బ్యాంకు ఏటీఎం నుంచి అయితే మెట్రో ప్రాంతాల్లో 5 లావాదేవీలు, ఇతర ప్రాంతాల్లో 3 లావాదేవీలకు అనుమతిస్తారు. ఈ పరిమితి దాటితే లావాదేవీ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక్కో లావాదేవీకి రూ.21 చొప్పున ఖాతాదారుల నుంచి రుసుము వసూలు చేస్తున్నారు. ఆర్బిఐ తాజాగా అనుమతించిన నేపథ్యంలో ఆ మొత్తం రూ.23కి పెరగనుంది. బ్యాంకింగ్ సేవల్లో ఒకప్పుడు విప్లవాత్మకంగా భావించిన ఏటీఎంలుు.. డిజిటల్ చెల్లింపుల పెరుగుదలతో సవాళ్లను ఎదుర్కొంటున్నా యి. అయితే గ్రామీణ ప్రాంతాల్లోనూ, ఇంటర్నెట్ సేవలందని ప్రాంతాల్లోనూ నేటికీ ఎటిఎంలే కీలకం. తాజా ఫీజు పెంపు నేపథ్యంలో గ్రామీణ ప్రజలపై అధిక భారం పడనుంది.