నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల కల సాకారమై దశాబ్ద కాలం గడవడం సంతోషంగా ఉందని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం మొట్టమొదటగా నినదించిన జాతీయ పార్టీ సీపీఐ అని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో ఏబీ బర్దన్, గురుదాస్ దాస్గుప్తా, సురవరం సుధాకర్రెడ్డి, కె నారాయణ, డి రాజా తెలంగాణ సాధన కోసం కృషి చేశారని తెలిపారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, వివక్షపై 2000 సంవత్సరంలోనే వరంగల్ డిక్లరేషన్ ప్రకటించిందని వివరించారు. తెలంగాణ జేఏసీలో సీపీఐ భాగస్వామిగా లేకున్నా అది ఇచ్చే పిలుపుల్లో పాల్గొన్నామని పేర్కొన్నారు. తెలంగాణ సాధన పోరాటంలో తమ పార్టీ పోరాటాలు, త్యాగాలు చేసిందని తెలిపారు.