ఆరంభ మ్యాచ్కు చెపాక్ ఆతిథ్యం
భారత్, ఆసీస్ ప్రధానుల సమక్షంలో ప్రకటన
మెల్బోర్న్ (ఆస్ర్టేలియా)
భారత్, ఆస్ర్టేలియా ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాల్లో అతిపెద్ద అడుగు పడింది. ఇప్పటికే కబడ్డీ, క్రికెట్ లీగ్లలో ఎంపిక చేసిన మ్యాచ్లను ఆస్ర్టేలియాలో నిర్వహించే ఆలోచనలకు పదునెక్కుతుండగా.. తాజాగా బిగ్బాష్ లీగ్ 2026-27 సీజన్ ఆరంభ మ్యాచ్ను భారత్లో నిర్వహించనున్నారు. భారత ప్రధాని నరెంద్ర మోడి ఆస్ర్టేలియా పర్యటన సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. సెంటర్ ఆఫ్ ఆస్ర్టేలియా-భారత్ రిలేషన్స్ సంస్థ దీనికి ఆర్థికంగా మద్దతు ఇవ్వనుంది. క్రికెట్ ఆస్ర్టేలియా సైతం నిదులు సమకూర్చనుంది. భారత ప్రధాన మోడి, ఆసీస్ ప్రధాని ఆల్బనీస్ సమక్షంలో క్రికెట్ ఆస్ర్టేలియా శుక్రవారం మెల్బోర్న్లో ఈ ప్రకటన చేసింది. భారత్ సైతం ఐపీఎల్ మ్యాచ్లను ఆస్ర్టేలియాలో నిర్వహించే ఆలోచన చేస్తుందని సీఏ ఆశాభావం వ్యక్తం చేసింది.
డిసెంబర్ 12న చెన్నైలో
ఆరంభ మ్యాచ్ :
బిగ్బాష్ లీగ్ 2026-27 సీజన్ షెడ్యూల్ను ఇంకా ఖరారు చేయలేదు. కానీ భారత్లో ఆరంభ మ్యాచ్ ప్రకటన కోసం తొలి మ్యాచ్ తేదిని వెల్లడించారు. డిసెంబర్ 12న ఆరంభ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగనుంది. డిఫెండింగ్ చాంపియన్స్ పెర్త్ స్కార్చర్స్తో మెల్బోర్న్ రెనెగెడ్స్ తలపడుతుంది. డిసెంబర్ 6న షెఫల్డ్ షీల్డ్ దేశవాళీ టోర్నీ ముగియనుండగా.. ఈ రెండు జట్ల ఆటగాళ్లు నేరుగా చెన్నైకి చేరుకోనున్నారు. చెపాక్లో మెల్బోర్న్, పెర్త్ జట్ల ఆటగాళ్లు మ్యాచ్ ముంగిట నాలుగు రోజుల పాటు సాధన చేయనున్నారు. బిగ్బాష్ లీగ్ మిగతా మ్యాచ్లన్నీ ఆస్ర్టేలియాలో జరుగుతాయి. దీంతో ఈ రెండు జట్లకు రెండో మ్యాచ్కు కనీసం ఓ పది రోజుల విరామం లభించేలా షెడ్యూల్ రూపొందించనున్నారు. బిగ్బాష్ లీగ్ను ఐపీఎల్ తరహాలో ప్రయివేటీకరణ చేసేందుకు క్రికెట్ ఆస్ర్టేలియా ఆలోచన చేస్తుండగా… మెల్బోర్న్, పెర్త్ జట్ల యాజమాన్యాలు (రాష్ర్ట క్రికెట్ సంఘాలు) క్రికెట్ విక్టోరియా, వెస్టర్న్ ఆస్ర్టేలియాలు అందుకు సుముఖంగా ఉన్న సంగతి తెలిసిందే. చెన్నైలో ఆడేందుకు పలు క్లబ్లు ఆసక్తి చూపించాయని.. ఆరంభ మ్యాచ్కు స్టేడియం అభిమానులతో నిండుతుందని సీఏ దీమా వ్యక్తం చేసింది. క్రికెట్ ఆస్ర్టేలియాతో జత కట్టి.. బిగ్బాష్ లీగ్ ఆరంభ మ్యాచ్కు ఆతిథ్యం అందించటం గౌరవంగా భావిస్తున్నామని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టిఎన్సీఏ) ప్రెసిడెంట్ టిజె శ్రీనివాసరాజ్ అన్నారు.
చెన్నైలో బిగ్బాష్ లీగ్
- Advertisement -
- Advertisement -


