నవతెలంగాణ-హైదరాబాద్: ఒడిశాలో కాలేజ్ లెక్చరర్ లైంగిక వేధింపుల భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలు సూసైడ్ చేసుకోలేదని, బీజేపీ పాలన సిస్టమ్ ఆ విద్యార్థిని బలి తీసుకుందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో ఆ విధ్యార్థినికి రక్షణ కల్పించలేకోపోయరని మండిపడ్డారు. పలుమార్లు లైంగిక్ వేధింపులకు గురైన, ఆమెకు న్యాయం చేయకుండా పదేపదే అవమానించబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. “ధైర్యవంతురాలైన విద్యార్థిని లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచిందని, కానీ న్యాయం చేయడానికి బదులుగా, ఆమెను బెదిరించారు, హింసించారు, పదే పదే అవమానించారు. ఆమెను రక్షించాల్సిన వారు విరుచుకుపడ్డారు. ఒడిశాలో న్యాయం కోసం పోరాడుతున్న ఒక కుమార్తె మరణం బీజేపీ వారిచే హత్య కంటే తక్కువ కాదు”అని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
ఈ ఘోర దుర్ఘటనపై ప్రధాని మోడీ మౌనం విడి స్పందించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఆడబిడ్డలకు తప్పనీసరిగా రక్షణ, న్యాయం దక్కేల చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఒడిశాలో అయినా, మణిపూర్లో అయినా, దేశపు కుమార్తెలు కాలిపోతున్నారు, విరిగిపోతున్నారు, చనిపోతున్నారని, ప్రధాని మౌనంగా ఉన్నారని, దేశానికి మోడీ మౌనం అవసరం లేదని, దానికి సమాధానాలు చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. బీజేపీ వ్యవస్థ నిందితులను కాపాడుతూనే ఉందని ఆరోపించారు. దీంతో ఒక అమాయక కుమార్తె తనను తాను నిప్పంటించుకునేలా బీజేపీ పాలన ప్రేరేపించిందని విమర్శించారు.
కాలేజీ ప్రొఫెసర్ లైంగిక వేధింపులు భరించలేక ఒడిశాకు చెందిన ఓ విద్యార్థిని నిప్పంటించుకున్న సంగతి తెలిసిందే. 95 శాతం గాయాలపాలైన బాధితురాలు మూడు రోజులుగా ప్రాణాలతో పోరాడుతూ సోమవారం రాత్రి మృతిచెందింది. భువనేశ్వర్లోని ఎయిమ్స్ ఐసీయూలోని బర్న్స్ వార్డులో చికిత్సనందిస్తూ, మూత్రపిండ మార్పిడి చికిత్సతో సహా అన్ని సాధ్యమైన వైద్య సహాయం అందించినప్పటికీ, బాధితురాలిని బతికించలేకపోయామని, ఆమె సోమవారం రాత్రి 11:46 గంటలకు మరణించిందని ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు.