ఉభయ సభలు నేటికి వాయిదా

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ శాసన మండలి, శాసన సభలు నేటికి వాయిదా పడ్డాయి. బుధవారం ఐదో రోజు శాసన సభ ప్రారంభం కాగానే బడ్జెట్‌పై జరిగిన చర్చలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ సభ్యులు కడియ శ్రీహరి పాల్గొంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వాస్తవ అంచనాలకు విరుద్దంగా బడ్జెట్‌ రూపొందించారని ఆరోపించారు. ఈ సందర్భంగా కడియం సర్కార్‌పై చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ జోక్యం చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ శాసన సభ్యులు వాకౌట్‌ చేసి మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాన్ని మార్షల్స్‌ అడ్డుకున్నారు. బడ్జెట్‌పై సాయంత్రం ఆరు గంటల వరకు చర్చ కొనసాగిన అనంతరం స్పీకర్‌ సభను వాయిదా వేసారు. మండలిలో సైతం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సభ్యుల మద్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి.
ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు చేసుకున్నారు. బడ్జెట్‌పై సాయంత్రం నాలుగు గంటల వరకు చర్చ కొనసాగిన అనంతరం సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు మండలి చైర్మెన్‌ ప్రకటించారు. కాగా గురువారం ఉభయ సభల్లో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమాధానం చెప్పనున్నారు. అలాగే కుల గణనపై అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశ పెట్టనుంది.

Spread the love