ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

–  మొదటి విడత శిక్షణ కార్యక్రమo పూర్తి
– ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచందన  దాసరి
 – ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించాలి
– ఓటరు  ఎడమ చేయి మధ్య వేలుకు ఇండెలిబుల్ ఇంక్  మార్కు చేయాలి
– ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
వరంగల్,ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల  రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు తెలియజేశారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ హైదరాబాద్ నుండి వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల ఏర్పాట్లపై నల్గొండ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తోపాటు, ఉప ఎన్నికలు జరిగే 12 జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ ఆదనపు కలెక్టర్లు,ఏ ఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికకు సంబంధించి చేసిన ఏర్పాట్లపై సీఈవో అడిగగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పరిధిలో 600 పోలింగ్ కేంద్రాలు, మరో 5 ఆక్సిలరి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అన్ని పోలింగ్ కేంద్రాలలో అవసరమైన కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
5  లక్షల బ్యాలెట్ పేపర్లు రాష్ట్రస్థాయి నుండి రావడం జరిగిందని, వాటన్నిటిని సంబంధిత జిల్లాలకు పంపించామని, పోలింగ్ కు అవసరమైన బ్యాలెట్ బాక్సులు సైతం సిద్ధంగా ఉన్నాయని, ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బందిని కేటాయించడం జరిగిందని, వీరందరికీ మొదటి విడత శిక్షణ కార్యక్రమాలను సైతం పూర్తి చేసినట్లు వివరించారు.  పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఉద్యోగులకు  ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు నల్గొండ జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేస్తున్నామని, 96 టేబుల్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్  మాట్లాడుతూ  శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికను ఆషామాసిగా తీసుకోవద్దని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఉద్యోగులకు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, ఎన్నికలలో ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం సరఫరా చేసిన వైలెట్ కలర్ స్కెచ్ పెన్,  ఇండెలిబుల్  ఇంకు  లు మాత్రమే వినియోగించాలని తెలిపారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు ముగిసినందున ఎం ఎల్ సి ఎన్నికలలో ఓటరు  ఎడమ చేయి మధ్య వేలుకు ఇండెలిబుల్ ఇంక్  మార్కు చేయాలని, ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను ప్రతి పోలింగ్ కేంద్రం  వద్ద బయట ప్రదర్శించాలని, అదేవిధంగా ఓటర్లు ఓటు ఎలా వేయాలో ప్రతి  పోలింగ్ స్టేషన్ వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలని సూచించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలపై సూచనలు..
నల్గొండ జిల్లా కలెక్టర్  ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన జిల్లాల అదనపు  కలెక్టర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో  ఎం ఎల్ సి ఎన్నికల పై సూచనలు చేశారు. ముఖ్యంగా పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్  బాక్స్ లను రిసెప్షన్ కేంద్రానికి తీసుకురావడంలో పూర్తి  జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన టార్పాలిన్లతో క్లోస్డ్ కంటైనర్  వాహనాలలో తేవాలని సూచించారు. ఈనెల 24న ఇతర పోలింగ్ సిబ్బంది మెటీరియల్ వస్తుందని దానిని తీసుకోవాలని,తక్షణమే పోలింగ్ సిబ్బంది ఉత్తర్వులను పంపించాలని, ఈ నెల 24న పోలింగ్ సిబ్బంది రండమైజేషన్ నిర్వహించడం జరుగుతుందని ఆమె వెల్లడించారు.  జిల్లా ఎస్పీ చందన దీప్తి ,రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ నల్గొండ, మిర్యాలగూడ ఆర్డీవోలు, ఏఆర్వోలు రవికుమార్, శ్రీనివాసరావు, స్పెషల్ కలెక్టర్ నటరాజ్ తదితరులు జిల్లా నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరుకాగా, రాష్ట్రస్థాయి నుండి ఆదనపు సీఈవోలు సర్ఫరాజ్, లోకేష్ కుమార్, డిప్యూటీ సిఈవో ఎల్. సత్యవాణి తదితరులు హాజరయ్యారు.
Spread the love