నవతెలంగాణ -కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని కేబీఏ ఇండోర్ స్టేడియంలో కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు ఘనంగా ముగిసాయి. ముగింపు కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. కమ్మర్ పల్లి మండల కేంద్రంలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులను సునీల్ కుమార్ అభినందించారు. టోర్నమెంట్ లో విజేతలుగా ఓపెన్ డబుల్స్ విభాగంలో నిజామాబాద్ కు చెందిన రాఘవ-అర్షద్ ప్రథమ స్థానంలో నిలువగా, కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ కు చెందిన సభ్యులు పెంట కిషన్-ఏలేటి మోహన్ రెడ్డి ద్వితీయ స్థానంలో నిలిచారు. తృతీయ స్థానంలో బైంసాకు చెందిన నవీన్-విష్ణు తృతీయ స్థానంతో సరిపెట్టుకున్నారు. 40 ప్లస్ డబుల్స్ విభాగంలో కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ కు చెందిన సభ్యులు పెంట కిషన్- ఏలేటి మోహన్ రెడ్డి ప్రథమ స్థానంలో నిలువగా, హైదరాబాద్ కు చెందిన డాక్టర్ నవీన్- సాయి ద్వితీయ స్థానంలో నిలిచారు. ముప్కాల్ కు చెందిన దినేష్- నవీన్ తృతీయ స్థానంతో సరిపెట్టుకున్నారు. వీరికి ముఖ్య అతిథిగా హాజరైన ముత్యాల సునీల్ కుమార్ బహుమతులను, నగదు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు అహ్మద్ హుస్సేన్, సలహాదారులు లుక్క గంగాధర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.