నవతెలంగాణ-హయత్నగర్
ప్రజల సౌకర్యార్థం విజయవాడ నేషనల్ హైవే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని శుక్రవారం మాదాపూర్ హైటెక్స్లో ఆర్ అండ్ బీ కార్యాలయంలో కార్పొరేటర్లు కొప్పుల నర్సింహారెడ్డి, కళ్లెం నవజీవన్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు విజయవాడ నేషనల్ హైవే రోడ్డు అభివద్ధిలో భాగంగా దుర్గా విలాస్ హౌటల్ నుండి హయత్ నగర్ వరకు నిర్మిస్తున్న అండర్ పాస్ రోడ్డు నిర్మాణం వలన ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను మంత్రికి వివరించారు. అండర్ పాస్ రోడ్డు నిర్మాణ విషయంలో స్థానికంగా ఉండే కార్పొరేటర్ల సమక్షంలో ప్రజల అభిప్రాయాల సేకరణ కోసం అధికారులు పర్యటించి..అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షిం చాలని మంత్రిని కోరారు. వివరించిన పలు సమస్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ రెడ్డి, శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.