కౌంటింగ్  విధులను జాగ్రత్తగా నిర్వహించాలి: కలెక్టర్

– కౌంటింగ్ టేబుల్ వద్ద  నిబంధనలు పాటించాలి 
– ఏమరుపాటుగా ఉంటే  ఎన్నికల నియమావళి కింద చర్యలు
– నల్గొండ జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరి చందన
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
పార్లమెంట్  ఎన్నికల పోలింగ్ లో  అధికారులు, సిబంది  బాగా పనిచేశారని, ఇదే ఉత్సాహంతో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరి చందన సూచించారు. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పై శనివారం నల్గొండ కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్లో కౌంటింగ్  సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు జరిగిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి చందన హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ  కౌంటింగ్ టేబుల్ వద్ద పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  అలర్ట్ గా ఉండాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో ఏ చిన్న సమస్య  తలెత్తిన వెంటనే ఆర్వో, ఏఆర్ఓ ల దృష్టికి తీసుకురావాలన్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న ఎన్నికల నియమావళి కింద చర్యలు తీసుకుంటామని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే మైక్రో అబ్జర్వర్స్, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, కౌంటింగ్ సెంటర్ లోకి ప్రవేశించిన సమయం నుండి ఏఏ స్టేజీలలో ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాలకు సంబంధించి ట్రైనర్ బాలు  వారికి  విపులంగా వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి  రెవిన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ పులిచింతల నటరాజన్, డిఆర్డిఓ నాగిరెడ్డి,నల్గొండ దేవరకొండ, హుజూర్నగర్ సూర్యాపేట, చండూరు ఆర్డీవోలు, శిక్షణ కార్యక్రమాల నోడల్ అధికారి జిల్లా వ్యవసాయ అధికారి  శ్రవణ్, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రామిక్ లు హాజరయ్యారు.
Spread the love