సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, రుణమాఫీని వర్తింపజేయాలి: సీపీఐ(ఎం)

నవతెలంగాణ – మునుగోడు

సాగుపై ఆధారపడి జీవిస్తున్న రైతులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అందించే రైతు భరోసా, రెండు లక్షల రుణమాఫీని వర్తింపజేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని  కల్వకుంట్ల గ్రామంలో నిర్వహించిన శాఖ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి సాగునీరు తాగునీరు అందించేందుకు పెండింగ్లో ఉన్న డిండి ఎత్తిపోతల పథకం, చర్లగూడెం రిజర్వాయర్ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు అధిక నిధులను కేటాయించాలని అన్నారు. చర్లగూడెం రిజర్వాయర్ లో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలం పాటను ఆపి, సింగరేణికి నేరుగా కేటాయించాలని డిమాండ్ చేశారు.
మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కేంద్ర బీజేపీ ప్రభుత్వం వేలంపాటను వేస్తున్నదని, సింగరేణి కంపెనీ కూడా ప్రైవేట్ సంస్థలతో వేలంపాటలో పోటీపడే స్థితికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. వాస్తవానికి శ్రావణపల్లిలో సింగరేణి సంస్థ బొగ్గు తవ్వాలి కానీ వేలంపాట ద్వారా ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించి బొగ్గు గనులను సరైంది కాదన్నారు. మన రాష్ట్రం నుంచి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ కేంద్రంగా వేలంపాటను ప్రారంభించడం సిగ్గుచేటు అని అన్నారు. బొగ్గు గనులన్నీ ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన తర్వాత సింగరేణి మిగిలేదేముంటుందని, క్రమంగా సింగరేణి సంస్థను బలహీనపరిచి నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. నగదీకరణ పేరుతో దేశంలో ఆరు లక్షల కోట్ల విలువైన అస్తూలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిందని, అందులో భాగంగానే కోట్ల విలువైన గనులను ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని నిర్ణయాన్ని తీసుకుందని విమర్శించారు. గత పది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 200 బొగ్గుబావులను ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టారని, ప్రభుత్వ రంగంలో గనులు లేకపోతే యువతకు ఉపాధి అవకాశాలు కనుమరుగవుతాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకోలేకపోయారని విమర్శించారు.
ప్రస్తుతం సింగరేణి 40 వేల మంది పర్మినెంట్ కార్మికులకు మరో 26,000 మంది కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నదని రికార్డు స్థాయిలో అతి తక్కువ ధరకే నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేస్తున్న ఘనత సింగరేణి సంస్థకే చెందుతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక రూపాలలో ఆదాయాన్ని తీసుకొస్తున్న సింగరేణిని ప్రైవేటీకరణ అప్పజెప్పి ప్రభుత్వ ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్న కేంద్ర ప్రభుత్వ ధమననీతిని రాష్ట్ర ప్రజానీకం ఖండించాలని అన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ వేగంగా జరిగితే విద్యుత్తు ధర విపరీతంగా పెరుగుతుందని అన్నారు. సింగరేణికి చెందిన 22 బొగ్గు బావుల్లో బొగ్గు నిల్వలు అడగండి పోయాయని కొత్త బ్లాకులో తవ్వకాలు ప్రారంభించాలని కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇందుకు అనుమతించకుండా మోకాలు అడ్డుతున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల తెలంగాణ ప్రజానీకానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, కాబట్టి శ్రావణపల్లి బ్లాకు తో పాటు మిగతా బ్లాక్ లను కూడా తక్షణమే సింగరేణి అప్పగించాలని ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వము అఖిలపక్షాన్ని కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొని శాసనసభ తీర్మానం చేయాలని, లేని పక్షంలో ప్రజానీకాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చూదతమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం , మండల కార్యదర్శి మిర్యాల భరత్, మండల సహాయక కార్యదర్శి వరికుప్పల ముత్యాలు, గ్రామ శాఖ నాయకులు బొందు అంజయ్య, పగిళ్ల మధు, బొందు నరసింహ, పంతులు నరసింహ, మాజీ సర్పంచ్ గౌరయ్య, జిల్లపల్లి యాదయ్య, పుల్కారం హనుమంతు, పులకరం సైదులు, పగిళ్ల యాదయ్య, కట్ట ఆంజనేయులు, బొందు సుందరయ్య, కట్ట లింగస్వామి, కుక్కల అంజయ్య, బొందు ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love