నవతెలంగాణ – డిచ్ పల్లి
ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. దరఖాస్తులు పెండింగ్ లో ఉండకుండా వెంటదివెంట పరిష్కరించేందుకు చొరవ చూపాలని అన్నారు. గురువారం డిచ్ పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు, ఆపరేటర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిలో ఎన్ని పరిష్కరించారు. ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయని ఆరా తీశారు. పెండింగ్ దరఖాస్తులను రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో పరిష్కరించాలని గడువు విధించారు. తహసిల్దార్ స్థాయిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రణాళికా బద్ధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. సక్సేషన్ , పెండింగ్ మ్యూటేషన్ వంటి దరఖాస్తులను అవసరమైన రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, డేటా కరెక్షన్ దరఖాస్తులను క్షేత్రస్థాయి విచారణ చేపట్టిన తర్వాత పరిష్కరించాలని అన్నారు. ఆయా గ్రామాల వారీగా దరఖాస్తులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, వాటి పరిష్కారంలో తాత్సారానికి తావులేకుండా చూడాలన్నారు. నిర్ణీత గడువులోపు ధరణికి సంబంధించిన అన్ని దరఖాస్తులను క్లియర్ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డిచ్ పల్లి తహసీల్దార్ ప్రభాకర్, ఆర్.ఐ ప్రభురాజ్, కార్యాలయ అధికారులు, సిబ్బంది ఉన్నారు.