పరిపాలనలో మానవత్వపు సొబగులు..

– విద్య, వైద్యంపై పాలనాధికారి ప్రత్యేక దృష్టి
– విద్య, వైద్య రంగాల్లో నాణ్యత ప్రమాణాలు పెంపుదలకు విశేష కృషి
– ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలతో పాటు ప్రయోగాత్మక కార్యక్రమాలు అమలు
– కలెక్టర్ అనురాగ్ జయంతి బదిలీ..
– కరీంనగర్ కలెక్టర్ గా పోస్టింగ్
– సుమారు మూడేండ్ల పాలనలో కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లాపై తనదైన ప్రత్యేక ముద్ర
నవతెలంగాణ – సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా తన సుమారు మూడేండ్ల   పాలనలో కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లాపై తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. 1 సెప్టెంబర్2021 న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు, అనేక కొత్త కార్యక్రమాలకు సిరిసిల్ల వేదికగా చేపట్టి ప్రజల ప్రశంసలు పొంది శభాష్ అని పించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత విద్య,వైద్యం అందించేందుకు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ఈ రెండు రంగాలను ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా చేస్తూ వాటిని ప్రజలకు మరింత చేరువ చేసేలా చూసి ఆదిశగా సఫలీకృతం అయ్యారు. ప్రభుత్వ అందించే ఉచిత వైద్యం, విద్య రెండూ రంగాలు బలోపేతం అయితేనే  పేదలు జీవితాలు బాగుపడతాయనీ ప్రగాఢంగా విశ్వసించే జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో ప్రభావవంతంగా అమలయ్యేలా చూస్తూనే గడిచిన రెండేండ్లలో విద్య , వైద్యం పై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ విద్య ,వైద్యంపట్ల ప్రజలలో ఉన్న అపోహను పోగొట్టి “సర్కారు విద్య, వైద్యం” వైపు ప్రజలను దారి మళ్లించేలా చేశారు. ఫలితంగా  ఆర్థికభారం తగ్గేలా చేశారు.
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పాలనపై ప్రత్యేక ఫోకస్…
ప్రభుత్వాస్పత్రుల ప్రక్షాళన..
జిల్లా, ఏరియా ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగులకు అందుతున్న వైద్య సేవలను కలెక్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారు. అన్ని వేళల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వైద్య సేవల్లో పురోగతికి కృషి చేసారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలకు  పరిష్కారం చూపుతూనే గుణాత్మక వైద్య సేవలు అందేలా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపారు.  మరోవైపు జిల్లా, ఏరియా ఆసుపత్రుల పై ఒత్తిడి తగ్గించాలంటే క్షేత్ర స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతం పై ప్రత్యేక దృష్టి పెట్టారు. చిన్నపాటి జబ్బులకు ప్రాథమిక స్థాయిలోనే వైద్య సేవలు అందేలా చూసారు. వారానికోసారి సబ్ సెంటర్ వారీగా సమీక్ష నిర్వహిస్తూ డెలివరీ ల సంఖ్యను పెంచారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య ప్రమాణాలను మెరుగు పరచడంలో ఇప్పటికే అరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎన్ క్వాస్ సర్టిఫికేట్ లభించింది. ఫలితంగా మరిన్ని నిధులు కేంద్రం నుంచి వచ్చే అవకాశం లభించింది. తన పాలనతో ప్రభుత్వాస్పత్రులను ప్రక్షాళన చేసారు.
మిషన్ 80 పర్సెంట్.. సూపర్ సక్సెస్..
జిల్లాలోని జిల్లా, ఏరియా ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంస్థాగత ప్రసవాల సంఖ్యను 80% పైగా పెంచాలన్న లక్ష్యంతో “మిషన్ 80 ” నీ చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సంస్థ గత డెలివరీతో పాటు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడం  ద్వారా పేదలపై ఆర్థిక భారాన్ని తగ్గించడం, అనారోగ్యం బారిన పడకుండా చూడడం  ఈ మిషన్ 80 ముఖ్య ఉద్దేశ్యం. ఈ మిషన్ తో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెరిగి సంస్థాగత ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. పేద ప్రజలతో పాటు  ఆర్థిక స్తోమత ఉన్న ప్రజలు కూడా ప్రభుత్వాసుపత్రులలోనే ప్రసవాలకు పోసుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో గత సంవత్సరం  సంస్థాగత ప్రసవాలు సగటు  కేవలం 50 శాతం లోపే ఉండగా వాటిని 80 శాతం కు పెంచారు. ఇప్పుడు మొదటి కాన్పు సాధారణ ప్రసవం అయ్యేలా ప్రత్యేక దృష్టి సారించారు.
గర్భిణులకు సహాయకారిగా..మాతృ సేవా కార్యక్రమానికి శ్రీకారం..
రోగులు ఆసుపత్రి కి వచ్చాక డాక్టర్ ను కలిసేందుకు ఎవరిని సంప్రదించాలో.. మందులు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలో.. పరీక్షల కోసం ఎవ్వరినీ సంప్రదించాలో..స్కానింగ్ ఎక్కడా చేస్తారో..వైద్య సిబ్బంది రోగుల పట్ల వ్యవహరించే విధానం, తీసుకునే కేర్ లో కొంత అక్కడక్కడ నిర్లక్ష్యం.. తెలియని అయోమయం ప్రతి ఒక్కరికీ అనుభమే. అందుకే ఆర్థికంగా భారమైన కూడా పేదలు ప్రభుత్వాసుపత్రులకు వెళ్లకుండా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తూ..ఆరోగ్యాన్నే కాదు, ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు. వీటన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన జిల్లా కలెక్టర్  రోగులను రిసీవ్ చేసుకునే విధానంలో, సేవలు అందించే  విషయంలో కొన్ని మార్పులు రావాల్సి ఉందని భావించారు. అనుకున్నది తడువుగా… జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితో పాటు వేములవాడ ఏరియా ఆస్పత్రిలో  ప్రత్యేక పబ్లిక్ రిలేషన్ వ్యవస్థ ను “మాతృ సేవా కార్యక్రమం” పేరుతో జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న హెల్త్ సూపర్ వైజర్ లకు ప్రజా సంబంధాల అధికారి బాధ్యతలను అప్పగించారు. వీరికి మేటర్నిటీ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ గా నామకరణ చేశారు.సిరిసిల్లలో జిల్లా ఆసుపత్రిలో 8 మంది, వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో 5 మంది  హెల్త్  సూపర్ వైజర్ లకు వీఆర్వో లుగా బాధ్యతలు అప్పగించారు. 3 షిఫ్ట్ లలో 24 గంటలు ఆసుపత్రులలో అందుబాటులో ఉంటూ గర్భిణులకు సేవలు అందిస్తున్నారు.హెల్త్ సూపర్ వైజర్ లను, వారి సహాయకులను సులభంగా గుర్తించేలా వారికి ప్రత్యేక డ్రెస్ ఏర్పాటు చేశారు. హెల్త్ ఎడ్యుకేటర్ లకు బ్లెజ్ కోట్, సహాయకులుగా ఉండే నర్సింగ్ విద్యార్థులకు స్లీవ్ లెస్ బ్లేజ్ ను డ్రెస్ కోడ్ ను అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం ద్వారా హెల్త్ సూపర్ వైజర్ లకు సహాయకులుగా నర్సింగ్ కళాశాల విద్యార్థులు ఉంటూ తమ శిక్షణ లో భాగంగా సోషల్ సర్వీస్, సోషల్ మేనేజ్ మెంట్ నైపుణ్యాల మెరుగుపరచుకునేలా ప్లాన్ చేశారు. గర్భిణులకు అందించే వైద్య సేవలపై కూడా అవగాహన పెంచుకోనున్నారు. గర్భిణీలు రాగానే వారిని ప్రేమపూర్వకంగా రిసీవ్ చేసుకోవడం, ఆసుపత్రి రాకకు గల కారణాలను తెలుసుకోవడం..వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు వారి వెన్నంటే ఉంటూ వారికి కావాల్సిన సేవలకు సులభంగా, వేగంగా అందేలా చూస్తున్నారు.
డ్రై డే పై ప్రత్యేక దృష్టి..
వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు పోటెత్తుతాయి. చికిత్స కంటే నివారణ మేలు అని భావించిన జిల్లా కలెక్టర్ వర్షాకాలకు ముందే వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ శాఖ, పురపాలక శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యం పై ఫోకస్ పెంచారు.  గ్రామాలు, పట్టణాల్లోని త్రాగునీటి వాటర్ ట్యాంకులను ప్రతి పది రోజులకు ఒకసారి శుభ్రం చేసేలా  ప్రత్యేకంగా మానిటర్ చేశారు. వారంలో ప్రతి మంగళవారం, శుక్రవారం డైడే ప్రభావవంతంగా అమలవ్వడంపై ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణాల్లో ఈ రెండు రోజులతో పాటు ఆదివారం డ్రై డే కార్యక్రమం అమలయ్యేలా క్షేత్ర స్థాయిలో మానిటర్ చేశారు. ఫలితంగా జిల్లాలో సీజనల్ వ్యాధులు సమర్థవంతంగా అరికట్టగలిగారు.
పోషకాహార పండుగ.. మిల్లెట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ శ్రీకారం..
రాజన్న సిరిసిల్ల జిల్లాను పోషకాహారలోప రహితంగా తీర్చిదిద్దాలన్న  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ‘మిల్లెట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌’ పేరిట నయా కార్యక్రమాన్ని కొద్దికాలం అమలు చేశారు. కాల్షియం, ఐరన్‌, పీచు పదార్థం ఎక్కువ ఉండే రాగి లడ్డూను ప్రతి శనివారం అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులకు అందించారు. ఈ ప్రయోగం వెనుక.. పోషకాహారలోప నివారణే కాక, స్థానిక రైతులను చిరుధాన్యాల సాగువైపు మళ్లించే లక్ష్యం కూడా పెట్టుకున్నారు. వృద్ధుల కోసంఎల్లారెడ్డిపేటలో రాష్ట్రంలోనే తొలి డే కేర్‌ సెంటర్‌ ను ప్రారంభించారు. జీవిత చరమాంకంలో ఆహ్లాదాన్ని అందించి ఆయుష్షు పెంచేందుకు మానవీయ కోణంలో వినూత్న వేదికకు శ్రీకారం చుట్టారు. అలాగే మండేపల్లి గ్రామాల్లో ప్రభుత్వ  వృద్ధాశ్రమాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. ఈ రెండింటిలో వృద్ధుల కోసం అన్ని సదుపాయాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
పీహెచ్ సీలో పీజీయోథెరపీ సేవలు..
తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి సారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పీజీయోథెరపీ సేవలను ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి కే తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక చొరవతో ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రూ.90 వేల తో ట్రాన్స్‌క్యుటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్, అల్ట్రాసౌండ్, ట్రాక్షన్ ఎలక్ట్రోథెరపీ వంటిపీజీయోథెరపీ పరికరాలను సమకూర్చి ప్రత్యేక క్లినిక్ ను ఏర్పాటు చేశారు. సహజంగానే ఎదుర్కొనే వ్యాధులలో ప్రధానంగా వెన్ను, అరికాళ్లు, పిక్కలు, మోకాళ్లు, భుజాలతో పాటు ఇతర నొప్పుల నివారణకు నిపుణులైన వైద్యులతో ఫిజియోథెరపీతో సేవలు అందించనున్నారు.ఫిజియోథెరపీ క్లినిక్ ఏర్పాటు తో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిలో అందే సేవలు ప్రాథమిక స్థాయిలోనే ప్రజలకు లభిస్తున్నాయి.
ఎస్సీ హాస్టల్స్ ఆధునీకరణ..
జిల్లాలో 6 ఎస్సీ హాస్టల్ లను జిల్లా కలెక్టర్ ఆధునీకరించారు. విద్యార్థినీ, విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉండేలా ప్రత్యేక చొరవ చూపారు. వాటర్ హీటర్, దోమ తెరలు, బెడ్స్, రీడింగ్ రూం, స్పోర్ట్స్, వ్యాయామ పరికరాలు, చక్కని పెయింటింగ్, ఆహ్లాద వాతావరణం ఇలా అన్ని సౌకర్యాలు ఉండేలా చూసారు.వీటితో పాటు మన ఊరు మనబడి కార్యక్రమం ను క్షేత్ర స్థాయిలో ప్రభావవంతంగా అమలయ్యేలా ప్రత్యేక శ్రద్ద కనబరిచారు.
పార్క్ లపై ప్రత్యేక దృష్టి..
పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందువలన ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ పార్కుల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించారు. సిరిసిల్ల అర్బన్ పార్క్ అందంగా తీర్చిదిద్దారు. ప్రారంభోత్సవానికి సన్నద్ధం చేశారు. వేములవాడ మూలవాగు బండ్ పార్క్ అందంగా తీర్చిదిద్ది అందుబాటులోకి తెచ్చారు. సిరిసిల్ల కొత్త చెరువును పర్యాటకుల సందర్శన, స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు సుందరంగా తీర్చిదిద్దారు. ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ పట్టణంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా జంక్షన్ ల అభివృద్ధి చేశారు. నంది కమాన్ జంక్షన్, జగిత్యాల రోడ్ జంక్షన్ ను చూపరులను కట్టిపడేసేలా , భక్తి భావం పెంపొందించేలా సుందరంగా తీర్చిదిద్దారు.
పేదల పెన్నిధి.. సమస్యలకు పరిష్కారం పై ప్రత్యేక దృష్టి..
ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి తో పాటు జిల్లా కలెక్టర్ అనురాగం జయంతి పని దినాల్లో  సాయంత్రం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజల సమస్యలను ఓపిగ్గా ఉంటూ పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలలో ఆధునిక ఐటీ, ఐటీ ఆధారిత విద్యా బోధన అందించే లక్ష్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రయోగాత్మకంగా 60 ప్రభుత్వ పాఠశాలలలో 12,800 మంది విద్యార్థులకు ‘కంప్యూటర్ చాంప్స్’ పేరుతో డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. డిజిటల్ అక్షరాస్యత వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉండే అవకాశాలను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అందిపించుకోవాలన్నది ఈ కార్యక్రమం ఉద్దేశ్యం.
వేములవాడలో పశువుల పేడతో బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణం తిప్పాపూర్ లో వేములవాడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో  ఆవు, కోడెల పేడ ఆధారిత బయోగ్యాస్ ఆధారిత ఎలక్ట్రికల్ ప్లాంట్ ను శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయం నిధులు రూ.31 లక్షల 60 వేల తో  నిర్మించారు. ఇటీవలే దీనిని ప్రారంభించారు. ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తయ్యే పర్యావరణ హిత గ్రీన్ ఎనర్జీ విద్యుత్ ను గోశాలను ఆనుకుని ఉన్న వేములవాడ ఏరియా ఆసుపత్రి తో పాటు ఆలయ ఎలక్ట్రిసిటీ  అవసరాలను తీర్చనుంది.
మానసిక సమస్యలతో బాధపడేవారికి ఆశా “కిరణం”..
మానసిక రుగ్మలతో బాధపడుతున్న వారి బతుకుల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ‘కిరణం’ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్రంలోనే తొలిసారిగా సలహా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అందులో మానసిక వైద్య నిపుణులు,సైకలాజిస్ట్‌లు, సైక్రియాటిస్ట్‌లను నియమించింది. నిరంతరం సేవలందిచేలా 1800425 3333 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రభావంతంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇలా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గడిచిన మూడు సంవత్సరాలలో  ప్రభుత్వ కార్యక్రమాలను ప్రభావంతంగా అమలు చేయడంతో పాటు సరికొత్త ప్రయోగాత్మక కార్యక్రమాలను జిల్లాలో చేపడుతూ పరిపాలనలో మానవత్వపు సొబగులు అద్దుతూ ప్రభుత్వానికీ మంచి పేరు తెస్తూ ప్రజల మన్ననలు కలెక్టర్ పొందారు.

Spread the love