రాష్ట్రానికి విదేశీ జర్నలిస్టులు

– పది దేశాల నుంచి రాక
– ప్రముఖ కేంద్రాల సందర్శన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెస్తున్న పర్యాటక, సాంస్కృతిక, పారిశ్రామిక, విద్యా కేంద్రాలను సందర్శించటానికి 21 మంది విదేశీ మీడియా ప్రతినిధులు బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ చేరుకున్నారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, ప్రోటోకాల్‌ విభాగం అధికారులు వీరికి స్వాగతం పలికారు. తూర్పు ఆసియా, యూరేసియా, మిడిల్‌ ఈస్ట్‌ ప్రాంతంలోని జార్జియా, ఆర్మేనియా, ఇరాన్‌, బెలారస్‌, తుర్క్‌మెనిస్తాన్‌, కిర్గిజ్‌ రిపబ్లిక్‌, తజికిస్తాన్‌, ఉజ్జెకిస్తాన్‌, మంగోలియా, కజకిస్థాన్‌ దేశాలకు చెందిన ప్రముఖ మీడియా ప్రతినిధులు నాలుగు రోజుల పర్యటనకు వచ్చారు. పర్యటనలో భాగంగా గోల్కొండ కోట, శిల్పారామం, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, స్కైరూట్‌ ఎయిరో స్పేస్‌ సెంటర్‌, టీ- హబ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, రామోజీ ఫిల్మ్‌ సిటీని ఈ మీడియా బృందం సందర్శించనుంది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన విదేశీ దౌత్యవేత్త కార్యాలయం అధికారులు సైతం ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.

Spread the love