నవతెలంగాణ – హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి (52) కన్నుమూశారు. గత ఐదు రోజులుగా గుండెపోటుతో సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, గురువారం అర్ధరాత్రి 12.50 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఆయన మరణవార్తతో బీఆర్ఎస్ శ్రేణుల్లో, నర్సంపేట నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ నెల 26న హనుమకొండలోని తన నివాసంలో ఉన్న సుదర్శన్రెడ్డికి ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన కార్డియాక్ అరెస్ట్కు గురైనట్లు వైద్యులు గుర్తించారు. సుమారు గంట పాటు శ్రమించి, తొమ్మిది సార్లు సీపీఆర్ చేసిన తర్వాత ఆయన గుండె తిరిగి స్పందించింది. దీంతో మెరుగైన చికిత్స కోసం వెంటనే సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ప్రత్యేక వైద్య బృందం ఆయనను వెంటిలేటర్పై ఉంచి చికిత్స ప్రారంభించింది. అయితే, సుదీర్ఘకాలం స్పృహలోకి రాకపోవడంతో నాడీ సంబంధిత స్పందన కనిపించలేదు. ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కారణంగా మెదడుకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఈసీజీ, బ్రెయిన్ ఎంఆర్ఐ పరీక్షల్లో తేలిందని వైద్యులు తెలిపారు. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆయన చివరకు కన్నుమూశారు.



