నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు అందించారు. రాష్ట్రంలో త్వరలో పెద్ద ఎత్తున అందుబాటులోకి రానున్న ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. మొగల్తూరులో నిర్వహించిన ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి ఈ కీలక ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తోందని పేర్కొన్నారు. సంక్షేమంతో కూడిన అభివృద్ధే తమ ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు పింఛన్ల రూపంలోనే ప్రజలకు రూ. 73,000 కోట్లు అందించినట్లు గుర్తుచేశారు. మహిళలు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వారి కష్టాలను తీర్చేందుకే ‘దీపం’ పథకాన్ని తీసుకువచ్చామని వివరించారు.



