ముంపు గ్రామాల ఆర్థిక అభివృద్ధే లక్ష్యం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

– మత్స్యకారులకు కేజ్ కల్చర్ చేపల పెంపకంపై అవగాహన సదస్సు
– అనుపురంలో కుట్టు శిక్షణ,మిల్లెట్ ఫుడ్ తయారీ ప్రారంభం
నవతెలంగాణ – వేములవాడ
ముంపు గ్రామాల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. మిడ్ మానేరు ముంపు గ్రామాల మత్స్యకారులకు కేజ్ కల్చర్ లో భాగంగా రాహు, బొచ్చె, బంగారు తీగ తదితర చేప పిల్లల పెంపకంఫై అవగాహన సదస్సును వేములవాడ అర్బన్ మండలం రుద్రవరంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా మత్స్యశాఖ అధికారులు మత్స్యకారులకు కేజ్ కల్చర్ చేపల పెంపకంఫై వీడియో ద్వారా వివరించారు. ఈ యూనిట్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఉందని తెలిపారు. తక్కువ స్థలంలో తక్కువ పెట్టుబడి తో అధిక లాభాన్ని పొందడమే దీని లక్ష్యమని స్పష్టం చేశారు.  అనంతరం మత్స్యకారులకు కేజ్ కల్చర్ పై అవగాహన కల్పించి, దరఖాస్తుల స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు. ముంపు గ్రామాల ప్రజల ఆర్థిక అభివృద్ధికి కేజ్ కల్చర్ చేపల పెంపకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో చేపల పెంపకంతో  లాభాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ముంపు గ్రామాల సమస్యలు త్వరలో పరిష్కరించుకుందామని పేర్కొన్నారు. ప్రజలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అర్హులందరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మధ్య మానేరు ప్రాజెక్ట్ పరిధిలో మొత్తం 1600 మత్స్యకారుల కుటుంబాలు రిజిస్టర్ అయి ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం మొత్తం 1100 కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉందని విప్ వెల్లడించారు. జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ- రాఘవరెడ్డి మాట్లాడారు. పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్దికంగా రాణించాలని ఆకాంక్షించారు.
ముంపు గ్రామాల మత్స్యకారులకు సువర్ణ అవకాశం: చేపల పెంపకం ముంపు గ్రామాల మత్స్యకారులకు సువర్ణ అవకాశమని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. యూనిట్ మొత్తం విలువ రూ. 3 లక్షలని, దానిలో పురుషులకు 40 శాతం, మహిళలకు 60 శాతం సబ్సిడీ ఉందని వెల్లడించారు. గ్రామంలోనే నోడల్ బ్యాంక్ ఆద్వర్యంలో రేపటి నుంచి శిబిరం ఏర్పాటు చేస్తామని, అవగాహన కల్పించి దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించారు. చేపల పెంపకం ఫై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా టూర్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అర్హులందరూ వినియోగించుకోవాలని సూచించారు. అలాగే అనుపురంలోని శాలివాహన సంఘ భవనంలో  మొదటి విడుత అనుపురం, రుద్రవరం, కోడుముంజ, చింటల్ ఠాణ గ్రామాల్లో  DRDA సౌజన్యంతో (SHG) మహిళలకు టైలరింగ్ లోని వివిధ మోడల్ లలో  అధునాతన ఫ్యాషన్ డిజైనింగ్, మిల్లెట్స్ ఆధారిత ఆహార ఉత్పత్తుల తయారీ పై శిక్షణ తరగతులు  అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి విప్ ఆది శ్రీనివాస్, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి హాజరై ప్రారంభించారు. అనంతరం విప్ మాట్లాడారు. మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టు మిషన్, మిల్లెట్ ఆధారిత ఆహార పదార్థాల తయారీ ఫై 15 రోజులు శిక్షణ ఇస్తారని, ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల దాకా తర్ఫీదు ఉంటుందని వివరించారు. మహిళలకు ఉదయం టిఫిన్, భోజనం, స్నాక్స్ ఉన్నాయని తెలిపారు. శిక్షణ కాలంలో రోజు రూ. 50 ఇస్తారన్నారు. మహిళలు శిక్షణను సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా ఎదగాలని పేర్కొన్నారు. స్కూల్ యూనిఫామ్ లు కూడా వీరి ద్వారా కుట్టించే విధంగా చర్యలు చేపడతామని విప్ తెలిపారు. పేపర్ బ్యాగులు కుట్టిస్తే వేములవాడ ఆలయం, అలాగే పట్టణంలోని దుకాణాల్లో తీసుకునేలా ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు.
కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం: అనుపురం లో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ప్రారంభించారు, మహిళలు శిక్షణ కాలంలో నేర్పించే అంశాలఫై దృష్టి సారించాలని కోరారు. మీరందరూ చాలా మందికి ఆదర్శ ప్రాయంగా నిలువాల న్నారు. కార్యక్రమ్మాల్లో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, డీఆర్డీఓ శేషాద్రి, నాబార్డ్ ఏజీఎం మోహన్ రెడ్డి, జిల్లా మత్స్య శాఖా అధికారి శివప్రసాద్, ఎంపీపీ బూర వజ్రమ్మ, జడ్పీటీసీ మ్యాకల రవి తదితరులు ఉన్నారు.
Spread the love