నవతెలంగాణ హైదరాబాద్: పవన్ పరిచయమున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని పెద్దలతో అమ్మాయి ఇంట్లో వారిని అడిగించాడు. వారు ఒప్పుకోకుండా వేరే అబ్బాయితో అమ్మాయి పెండ్లి జరిపించారు. దీంతో పవన్ పగ పెంచుకున్నాడు.. పథకం ప్రకారం ఆమె భర్తను హత్య చేశాడు. ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమండ్రి పరిధి కోరుకొండ మండలం ములగాడకు చెందిన కాల్ల వెంకటరమణ(30)కు కాకినాడ పరిధి అడవిపూడికి చెందిన శ్రావణి సంధ్యతో ఏడేండ్ల క్రితం వివాహమైంది. డ్రైవర్గా పని చేస్తున్న వెంకటరమణ కేపీహెచ్బీ కాలనీ భగత్సింగ్నగర్ ఫేజ్-1లో ఉంటున్నారు. వీరికి పిల్లలు లేరు. సమీపంలోని సర్ధార్పటేల్నగర్లో తోడల్లుడు దుర్గాప్రసాద్ ఉంటున్నాడు.
వీరి భార్యలు వారం క్రితం సొంతూరులో బంధువుల పెండ్లికి వెళ్లారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో దుర్గాప్రసాద్ డ్యూటీకి వెళ్లగా.. అతని గదిలో వెంకటరమణతోపాటు దుర్గాప్రసాద్ తమ్ముడు జగదీశ్, బావమరిది లక్ష్మీనారాయణ ఉన్నారు. 12.20 గంటల సమయంలో గది వెనక ఖాళీ స్థలంలో 5గురు యువకులు గట్టిగా అరుస్తున్నారు. వెంకటరమణ అపార్ట్మెంట్ పార్కింగ్ ప్రదేశానికి మధ్యలో కిటికీ మాదిరి ఉన్న గ్రిల్ దగ్గరికి వెళ్లాడు. పంపెన అయ్యప్పస్వామి అలియాస్ పవన్(27) గ్రిల్ అవతల ఉండి కత్తితో వెంకటరమణ గుండెల్లో పొడవగా అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.
సుమారు 8ఏండ్లుగా పవన్, శ్రావణి సంధ్యకి పరిచయముంది. పవన్ తన కుటుంబసభ్యులతో శ్రావణి సంధ్యని తనకిచ్చి పెండ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులను అడిగించాడు. వారు ఒప్పుకోలేదు. తర్వాత వెంకటరమణతో వివాహం చేశారు. అప్పటినుంచి వెంకటరమణను మట్టుబెట్టేందుకు యత్నిస్తున్నాడు. పథకం ప్రకారం.. ఆదివారం రాత్రి నలుగురితో వచ్చి అక్కడ తిష్ఠ వేశాడు. గొడవ సృష్టించి వెంట తెచ్చుకున్న కత్తితో వెంకటరమణను పొడిచాడు. పవన్ పరారీలో ఉండగా.. మిగతా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.