వడగాలులతో 16 మంది మృతి
ఒక్కో కుటుంబానికి
రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా : మంత్రి పొంగులేటి వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలపై రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అధిక ఉష్ణోగ్రతలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం హైదరాబాద్లోని సచివాలయంలో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడగాల్పులతో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 16 మంది మరణించారని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మృతుల ఒక్కో కుటుంబానికి రూ.నాలుగు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించామని అన్నారు. వచ్చే మూడు రోజులు మరింత తీవ్రంగా ఉష్ణోగ్రతలుంటాయని చెప్పారు. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల ప్రాణ రక్షణే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని అన్నారు. ఒక్క అధిక ఉష్ణోగ్రతలపై హై అలర్ట్
ప్రాణం కూడా కోల్పోకూడదని చెప్పారు. ఎండ తీవ్రతపై ప్రజలకు గంట గంటకు హెచ్చరికలు జారీ చేయాలని కోరారు. ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగు వరకు ప్రజలు బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ, నిర్మాణ కార్మికులకు ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. అధిక ఉష్ణోగ్రతలపై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఎండదెబ్బ కేసులకు ఆస్పత్రులు సిద్ధంగా ఉంచాలని కోరారు.



