నవతెలంగాణ-హైదరాబాద్ : సకాలంలో వైద్యం అందకపోవడంతో ఒమన్ తీరంలో భారత నావికుడు మృతిచెందినట్లు ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఒమన్ తీరంలో ఉన్న ‘ఎంటీ సెలెస్టియల్’ నౌక సెకండ్ ఆఫీసర్ నిశాంత్ (35) ఇటీవల అనారోగ్యానికి గురైనట్లు తెలిపింది. ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో ఒమన్లోని పోర్ట్ దుక్మ్ వైఫై కమ్యూనికేషన్లను నిలిపివేసిందని పేర్కొంది. దీంతో అత్యవసర వైద్య సాయం కోసం విజ్ఞప్తి చేసినా అధికారులు స్పందించలేదని తెలిపింది. ఫలితంగా వైద్యం అందక గురువారం నిశాంత్ మరణించినట్లు వెల్లడించింది. మృతుడు తమిళనాడుకు చెందిన వారు.
మృతదేహాన్ని కూడా సరైన సంరక్షణ లేకుండా నౌకలోనే వదిలివేయడంతో.. కుళ్లిపోయే స్థితిలో ఉందని ఎఫ్ఎస్యూఐ ఆందోళన వ్యక్తం చేసింది. ‘నావికులు నెలల తరబడి సముద్రంలో ప్రయాణం చేస్తూ.. ప్రపంచ వాణిజ్యాన్ని ముందుకు నడిపిస్తున్నారు. కానీ వారి గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. చివరికి వారి మృతదేహాలను సంరక్షించడంలో కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇతర దేశాల సముద్ర జలాల్లో మరణించిన నావికుల మృతదేహాలను గౌరవంగా స్వదేశానికి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాం’ అని ఎఫ్ఎస్యూఐ ఆవేదన వ్యక్తం చేసింది.
సాయం కోసం తాము చేసిన అభ్యర్థనలను నౌక యజమానులైన రొమానా షిప్ మేనేజ్మెంట్ కో లిమిటెడ్, వారి స్థానిక ఏజెంట్ పట్టించుకోవడం లేదని నౌక కెప్టెన్ ఆరోపించారు. అధికారులకు సమాచారం ఇచ్చినా.. పోర్ట్ కంట్రోల్ను పలుమార్లు సంప్రదించినా ఎటువంటి సాయం అందలేదన్నారు.



