ముగిసిన ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు..

Indore Tirumala Brahmotsavams have concluded..నవతెలంగాణ – మోపాల్ 

మోపాల్ మండలంలోని నర్సింపల్లి గ్రామంలో గల ఇందూరు తిరుమల పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజున.. మూల విరాట్టుకు ఉత్సవానంతర స్నపన సేవతో బ్రహ్మోత్సవాలను ముగించిన వేద పండితులు, ఏడు రోజుల పాటు ఎంతో వేడుకగా జరిగిన ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు నేడు బుధవారంతో ముగిసాయి. యజ్ఞాచార్యులు అర్చక స్వాములు వేద పండితులు 108 కళశాల్లో అభిషేక గంగను తీసుకొచ్చి స్వామి వారికి ఉత్సవానంతర అభిషేకం చేసి బ్రహ్మోత్సవాలను ముగించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి మంగళా శాసనములతో శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవానాథ జీయరు స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆచార్య గంగోత్రి రామానుజ దాస్ స్వామి వారి ఆశీస్సులతో బ్రహ్మోత్సవాలు అద్భుతంగా పరిపూర్ణం అయ్యాయి అని ఆలయ ధర్మకర్త శ్రీ నరసింహ రెడ్డి తెలిపారు. గ్రామ ప్రజల సహకారం మరువలేనిది అని అలాగే బ్రహ్మోత్సవాల్లో నర్సింగ్ పల్లి గ్రామస్తులతో పాటు జిల్లా నలు మూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి అని తెలిపారు. వచ్చే సంవత్సరం (2026) లో వచ్చే బ్రహ్మోత్సవాలు 12వ బ్రహ్మోత్సవాలు కాబట్టి చాలా పెద్ద వేడుకగా నిర్వహిస్తామని నరసింహ రెడ్డి గారు తెలిపారు. నేటి ముగింపు పూజా కార్యక్రమాల్లో గంగోత్రి రామానుజదాసు స్వామితో పాటు ఆలయ ధర్మకర్తలు దిల్ రాజు దంపతులు నర్సింహారెడ్డి దంపతులు, విజయసింహా రెడ్డి దంపతులు, నర్సారెడ్డి, నరాల సుధాకర్, పృథ్వీ, నరేందర్, మురళి,  యాజ్ఞాచార్యులు శిఖామణి ఆచార్యులు, సత్యన్నారాయణాచార్యులు,, రోహిత్ కుమారాచార్యులు, శ్రీకర్ కుమారాచార్యులు విజయ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Spread the love