నవతెలంగాణ-హైదరాబాద్ : జర్మన్ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ అడిడాస్, తన భారత టెక్నాలజీ విభాగంలో ఉద్యోగాల కోతకు శ్రీకారం చుట్టింది. గురుగ్రామ్లోని టెక్ హబ్లో ఈ ప్రభావం గణనీయంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెప్టెంబర్ 16న కంపెనీ ధ్రువీకరించింది.
ఈ కోతల వల్ల గురుగ్రామ్ హబ్లో పనిచేస్తున్న 350 మందికి పైగా, అంటే మొత్తం సిబ్బందిలో 45 నుంచి 50 శాతం మంది ప్రభావితమైనట్లు అనధికారిక అంచనాలున్నాయి. వీరిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, డేటా ఇంజనీర్లు ఉన్నారు. అయితే, మొత్తం ఇండియా టెక్నాలజీ ఆర్గనైజేషన్లో ఈ ప్రభావం 20 శాతం కన్నా తక్కువేనని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
సెప్టెంబర్ 15న నిర్వహించిన ఒక టౌన్హాల్ సమావేశంలో ఉద్యోగులకు ఈ విషయం తెలియజేశారు. సమాచారం ప్రకారం, ప్రభావితమైన సిబ్బందిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపునకు అదే రోజు ఉద్వాసన పత్రాలు అందజేశారు. మరో గ్రూపునకు డిసెంబర్ 15 వరకు గడువు ఇచ్చారు. ఈలోగా వారు కంపెనీలోని ఇతర విభాగాల్లో ఉద్యోగం వెతుక్కోవాలని, లేనిపక్షంలో డిసెంబర్ 15 వారి చివరి పనిదినం అవుతుందని స్పష్టం చేశారు.
వ్యాపార అవసరాలకు అనుగుణంగా సంస్థను బలోపేతం చేసేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని, ప్రభావిత ఉద్యోగులకు అవసరమైన సహాయం అందిస్తామని అడిడాస్ తెలిపింది. కాగా, ఉద్యోగులకు అందించే పరిహారం, ఇతర వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. 2021లో అడిడాస్ ఈ గ్లోబల్ టెక్ హబ్ను గురుగ్రామ్లో ప్రారంభించింది.


