– వలిగొండ నరసింహ
నవతెలంగాణ-ఓయూ
సీఎం రేవంత్రెడ్డిని విమర్శించే అర్హత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు లేదని తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్, నిరుద్యోగ బస్సు చైతన్య యాత్ర కో ఆర్డినేటర్, ఓయూ రీసెర్చ్ స్కాలర్ వలిగొండ నరసింహ అన్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్ద కాలంగా కుటుంబ పాలనలో ఏనాడు కూడా విద్యార్థి నిరుద్యోగుల గురించి మాట్లాడకుండా వారి సంక్షేమం పట్టించుకోకుండా, వారి జీవితాలను ఆగం చేశారన్నారు. మళ్లీ ఈరోజు నకిలీ ప్రేమ వలకబోస్తే ఎంతో చైతన్యవంతమైన తెలంగాణ విద్యార్థి, యువత నమ్మేస్థితిలో లేరన్నారు. తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల సంక్షేమం కోసం, తమ ఉజ్వల భవిష్యత్తు కోసం నిత్యం పరితపించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రజా పాలనను విమర్శించే హక్కు మీకు లేదని గుర్తు చేస్తున్నామన్నారు. మీ హయాంలో జరిగిన పేపర్ లీకేజీల మీద కనీసం స్పందించకుండా, ప్రవళిక ఆత్మహత్యను అవహేళన చేసిన నువ్వు నిరుద్యోగ విద్యార్థుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. ధ్వంసమైన విద్య వ్యవస్థని సరిదిద్దడం కోసం తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యకి ప్రాముఖ్యతను గుర్తించి దానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యమంత్రి ఆ శాఖ నిర్వహిస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పటికే పలుమార్లు విద్యా వ్యవస , ఉద్యోగ నియామకలపై పై రివ్యూ మీటింగ్లు పెట్టడం కూడా జరిగిందన్నారు. విద్యార్థి నిరుద్యోగ మిత్రులారా.. మన గురించి ఆలోచించే నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని.. దయచేసి కొద్దిమంది వ్యక్తిగత స్వార్థం కోసం చేసే రాజకీయాల్లో సమిధలు కావద్దని అన్నారు. కొద్దిగా ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో శంకర్ యాదవ్, వట్టికూటి అనిల్ గౌడ్, పార్ధు, ప్రవీణ్ నాయక్ ,వై అనిల్ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.