– కళాయాత్ర లోగోను ఆవిష్కరించిన ఆహ్వాన సంఘం చైర్మెన్, మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
డ్రగ్స్ పట్ల ప్రజలకు, యువకులకు, యువతులకి, విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం ప్రజానాట్యమండలి ”డ్రగ్స్ నిర్మూలిద్దాం – సమాజాన్ని మేలుకొలుపుదాం” అనే పేరుతో ఎగ్జిబిషన్- కళాయాత్ర నిర్వహించనుంది. ఈ మేరకు మంగళవారం అందుకు సంబంధించిన లోగోను రాష్ట్ర మంత్రి, ఆహ్వాన సంఘం చైర్మెన్ పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. అందమైన హైదరాబాద్ నగరాన్ని, ధనికుల పిల్లలు ,సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు విద్యార్థులు , యువతను, మధ్యతరగతి కుటుంబాలను వారు వీరు అనే తేడా లేకుండా అందరినీ డ్రగ్స్ భూతం పట్టిపీడిస్తున్నది. ఈ డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టడం కోసం ప్రజానాట్యమండలి యాత్ర నిర్వహిస్తోంది. నగరంలో చదువుకుంటున్న కొంతమంది యువకులు, విద్యార్థులు సిగరెట్ను సరదా కోసం తాగి నెమ్మదిగా అలవాటు పడేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది డ్రగ్స్ ను స్టయిల్ కోసం, గొప్పల కోసం తీసుకొని దానికి బానిసలు అవుతున్నారు. విలువైన జీవితాన్ని, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ప్రభుత్వం డ్రగ్స్ ను ఎంత కట్టడి చేసినా డ్రగ్స్ మాఫియా వివిధ రూపాల్లో వ్యాపారం సాగిస్తూ చివరకు చిన్న పిల్లలు తినే చాక్లెట్స్లో డ్రగ్స్ కలిపి వ్యాపారం చేస్తూ చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా దేశ అభివద్ధి లో ప్రముఖ పాత్ర పోషించవలసిన యువత డ్రగ్స్ మాఫీలో పడి జీవితాలను చీకటిలోకి నెట్టి వేసుకుంటున్నారు. ఈ కళాయాత్ర హై స్కూల్స్ ,జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ, కాలేజీల్లో కళారూపాల ప్రదర్శనల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను, యువతను ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం 2024 జులై 1 నుంచి 31 వరకు ఎగ్జిబిషన్స్, ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు కళాయాత్ర తో వివిధ కార్యక్రమాలను నిర్వహించడానికి పూనుకుంది ఈ సందర్భంగా ఆహ్వాన సంఘాన్ని ప్రకటించారు. ఆహ్వాన సంఘం చైర్మెన్ గా పొన్నం ప్రభాకర్, బీసీ వెల్ఫేర్ ట్రాన్స్పోర్ట్, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు చీఫ్ పాట్రన్స్ గా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ , సినీ గేయ రచయిత అశోక్ తేజ, నటుడు డాక్టర్ మాదాల రవి, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, డాక్టర్ నీలిమ, ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ జి.యన్ రావు, భారత్ ఇన్స్టిట్యూషన్స్ సీిహెచ్ వేణుగోపాల్ రెడ్డి , పట్నం సంస్థ కార్యదర్శి డిజి నరసింహారావు, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి నాగటి మారన్న, కోశాధికారి డి మహారాజ్లను ప్రకటించారు. ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో డీజీ నరసింహారావు, నాగటి మారన్న పి మల్లేష్,పి కళ్యాణ్ డి మహారాజ్ టీ రఘు, సోమేశ్, సునీత పాల్గొన్నారు.