నల్గొండ ప్రజల కోసం టీం వర్క్ చేద్దాం: కలెక్టర్ సి.నారాయణరెడ్డి

– వచ్చే సోమవారం నుండి  మండల స్థాయిలో కూడా  ప్రజావాణి 
– మండల స్థాయిలో పాలనను పటిష్టం చేద్దాం 
– ప్రజల అన్ని రకాల సమస్యలను తీర్చేందుకు ముందు ఉందాం
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు, సిబ్బంది అందరూ కలిసి ఒక బృందంగా పనిచేద్దామని నూతన జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారుల తో సమావేశం అయ్యారు. రెవెన్యూ అంశాలతో పాటు, ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు చొరవ చూపించాలని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో వారికి నమ్మకాన్ని, భరోసాను కల్పించాల్సిన అవసరం ఉందని, ప్రత్యేకించి పెండింగ్లో ఉన్న ధరణి  దరఖాస్తులన్నింటిని రానున్న 15 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. ఇందుకుగాను మండల స్థాయి నుంచి మొదలుకొని జిల్లా స్థాయి వరకు అధికారులు సిబ్బంది ఒక బృందంగా పని చేద్దామని చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు  రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించినట్లుగానే , ఇకపై మండల స్థాయిలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, వచ్చే సోమవారం నుండి మండల స్థాయిలో  ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని, ఇందుకుగాను మండల స్థాయిలో అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రతి సోమవారం పూర్తిగా ప్రజలకు కేటాయించాలని, ప్రజావాణిలో రెవెన్యూ, సంక్షేమ, అభివృద్ధి, ఇతర అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు అవసరమైతే పంచాయతీ కార్యదర్శుల సేవలను తీసుకోవాలని అన్నారు.  ప్రజా సమస్యల పరిష్కారంలో  భాగంగా పరిష్కారమయ్యే వాటిని వెంటనే పరిష్కరించడం, కాని వాటికి ఒక మార్గం  చూపించడం చేయాలని, నల్గొండ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం అద్భుతంగా జరిగేలా సహకరించాలని కోరారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని, ఎవరు గైర్హాజరు కాకూడదని సూచించారు.
ధరణి దరఖాస్తులపై దృష్టి సారించాలి..
రెవెన్యూ అధికారులు ధరణి దరఖాస్తుల పరిష్కారం పై ముందుగా దృష్టి సారించాలని, ప్రత్యేకించి భూములకు సంబంధించి పొజిషన్లో ఉన్న రైతులు, టైటిల్ పరిశీలన, ప్రభుత్వ ప్రాధాన్యత, న్యాయపరమైన వివాదాల వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలని, ఒకవేళ ఏదైనా దరఖాస్తు తిరస్కరించాల్సి వస్తే ఎందుకు తీరస్కరిస్తున్నామో స్పష్టంగా తెలియజేయాలని, ధరణికి సంబంధించిన రికార్డులు అన్నిటిని జాగ్రత్తగా నిర్వహించాలని, జిల్లాలో పెండింగ్ లో ఉన్న అన్ని ధరణి దరఖాస్తులను 15 రోజుల్లో పూర్తి చేయాల్సిందిగా పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధరణికి సంబంధించి జిఎల్ఎం, కోర్టు కేసులు, జిపిఏ, నాలా, సక్సెసన్, మిస్సింగ్ సర్వే నంబర్, టిఎం- 33 తదితర అన్ని అంశాలపై రెవెన్యూ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఆర్డీవోలు వారి డివిజన్ కు  సంబంధించి పూర్తి నియంత్రణ కలిగి ఉండాలని, వారి లాగిన్ లో ఉన్న అన్ని పిటీషన్లను పెండింగ్లో ఉంచుకోవద్దని తెలిపారు. తక్షణమే మీసేవ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించి మరోసారి ధరణిపై శిక్షణ ఇవ్వాలని, పూర్తిస్థాయిలో దరఖాస్తులను పరిశీలించాకే మీసేవ ఆపరేటర్లు పోర్టల్ లో అప్లోడ్ చేసే విధంగా వారికి సూచనలు జారీ చేయాలని, తప్పుగా అప్లోడ్ చేయకూడదని అన్నారు.  భూముల సర్వే కి సంబంధించి సర్వేయర్లు జాగ్రత్తగా సర్వే పనులు నిర్వహించాలని, ఎక్కడ తప్పు చేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ ఆర్డీవోలు రవి, శ్రీనివాసరావు, శ్రీరాములు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాసులు, అన్ని మండలాల తహసిల్దారులు, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మోతిలాల్, ఆయా విభాగాల పర్యవేక్షకులు,  రెవెన్యూ అధికారుల సమావేశానికి హాజరయ్యారు.
Spread the love