– జిల్లా కోశాధికారి అమర్లపూడి శరత్
నవతెలంగాణ-సత్తుపల్లి
ఈనెల 6న ఖమ్మం పట్టణంలోని రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) రాష్ట్ర జనరల్ కౌన్సిల్ను విజయవంతం చేయాలని ఆ యూనియన్ జిల్లా కోశాధికారి అమర్లపూడి శరత్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. సోమవారం సింగరేణి క్వార్టర్స్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో కార్మికుల పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, పని ప్రాంతాల్లో వేధింపుల నివారణ కోసం పోరాడుతున్న కార్మికులపై పాలకులు బాష్పవాయువు ప్రయోగించడం దారుణమన్నారు.
మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను, సమ్మె హక్కును కాలరాస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణలోని సుమారు 4 లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనాలు లేక దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలపై పోరాడటానికి, భవిష్యత్ ఉద్యమ కర్తవ్యాలను రూపొందించడానికి ఈ కౌన్సిల్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కావున కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కౌన్సిల్ను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, నాగేశ్వరరావు, స్వాతి, చిట్టెమ్మ, కళావతి, రమాదేవి, బాబు తదితరులు పాల్గొన్నారు.


