– సోషల్ మీడియా ప్రవేశంతో జర్నలిజంలో భారీ మార్పులు : ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశాంక్ గోయెల్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సమాజాభివృద్ధిలో మీడియా పాత్ర కీలకమని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశాంక్ గోయెల్ అన్నారు. శ్రీలంక మీడియా ప్రతినిధుల కోసం హైదరాబాద్లోని ఎమ్సీఆర్హెచ్ఆర్సీలో సోమవారం ‘మీడియా మేనేజ్మెంట్’ పై రెండు వారాల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజల గొంతుకగా పని చేస్తూ, పాలనలో పారదర్శక కోసం పాటుపడతారని ప్రశంసించారు. సోషల్ మీడియా ఆవిర్భావం తర్వాత మీడియా రంగంలో అనేక మార్పులు సంభవించాయని వ్యాఖ్యానించారు.ఖండాతరాల్లో ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో సమచారాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నదని గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మీడియా ల్యాండ్స్కేప్ను మార్చిందని వివరించారు. ఇది మీడియా ప్రపంచంలో ఊహించని పరివర్తనను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్తా పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందన్నారు.