నవతెలంగాణ – మద్నూర్
ఎర్రమంజిల్ లోని జలసౌధలో బారి జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గంలోని అంతర్ రాష్ట్ర లెండి ప్రాజెక్టు, నాగమడుగు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కౌలాస్ నాలా మరమ్మత్తులు, సింగితం రిజర్వాయర్ రిటర్నింగ్ వాల్, పెద్ద ఎడిగి కాల్వ మరమ్మత్తులు, బిచ్కుంద కమ్మరి చెరువు మరమ్మత్తులు చేయాలని, నియోజకవర్గంలోని చిన్న చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రికి విన్నవించగా.. సమీక్ష సమావేశంలో మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.