సెమీస్‌లో నర్సింహారెడ్డి జోడీ

సెమీస్‌లో నర్సింహారెడ్డి జోడీహైదరాబాద్‌ : హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ సంఘం (హెచ్‌ఓటీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 15వ జాతీయ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో నంద్యాల నర్సింహారెడ్డి, నీల్‌కాంత్‌ జోడీ జోరు కొనసాగుతోంది. పురుషుల 50 ప్లస్‌ డబుల్స్‌ విభాగంలో నంద్యాల, నీల్‌కాంత్‌లు అలవోకగా సెమీఫైనల్లో అడుగుపెట్టారు. శనివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో శ్రీధర్‌, బాలరాజు జోడీపై 8-5తో గెలుపొందిన నర్సింహారెడ్డి, నీల్‌కాంత్‌లు టైటిల్‌కు మరింత చేరువయ్యారు!. చంద్రశేఖర్‌ రెడ్డి, ఎల్‌. శ్రీధర్‌ సైతం 8-3తో శ్రీనివాస్‌, వెంకట్‌పై గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టారు. మెన్స్‌ సింగిల్స్‌ విభాగంలో ఈశ్వర్‌ సాయి 8-4తో విశాఖ్‌పై, కన్నన్‌ 8-0తో హనుమాన్‌ రాముపై గెలుపొంది 30 ప్లస్‌ విభాగంలో సెమీస్‌కు చేరారు. 40 ప్లస్‌ సింగిల్స్‌లో అఫ్రోజ్‌ 8-1తో రవిని, నర్సింహులు 8-1తో వి. ప్రకాశ్‌ను ఓడించి సెమీస్‌లో ప్రవేశించారు. 50 ప్లస్‌ సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్స్‌లో చంద్రశేఖర్‌ రెడ్డి 8-5తో సుధాకర్‌పై, నీల్‌కాంత్‌ 8-0తో జి. శ్రీనివాస్‌పై, వెంకట మూర్తీ 8-4తో శివ రామరాజుపై విజయం సాధించారు. 60 ప్లస్‌ సింగిల్స్‌లో మెహర్‌ ప్రకాశ్‌ 8-3తో అర్జున్‌ను.. రామి రెడ్డి 8-3తో కె.పి రావును ఓడించగా.. 70 ప్లస్‌ సింగిల్స్‌లో అంకయ్య 9-3తో రాజరత్నను, వి. గజపతి 9-2తో రాజగోపాలన్‌పై విజయం సాధించి సెమీస్‌లో కాలుమోపారు.

Spread the love