– ఐక్య విద్యార్థి, యువజన సంఘాల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
నవతెలంగాణ-ఓయూ
నీట్ పరీక్ష రద్దు చేసి తిరిగి మళ్ళీ పరీక్ష నిర్వహించాలని ఐక్య విద్యార్థి, యువజన సంఘాల కమిటీ సంయుక్తంగా డిమాండ్ చేశాయి. బుధవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఐక్య విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్ష వల్ల నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయలేని విద్య శాఖ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల కొనుగోలులో ఉన్న వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ఎన్టీఏను ప్రక్షాళన చేయాలని, నీట్ పరీక్ష అవకతవకల మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని కోరారు. నీట్ పరీక్షను రద్దు చెయ్యని యెడల ఐక్య విద్యార్థి సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా నిరసనలు,ర్యాలీ లు,బంద్లు, రాస్తారోకోలు చేసి ఉద్యమాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జాతీయ నాయకులు నాగేశ్వరరావు, వీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మాసంపల్లి అరుణ్ కుమార్, ఎన్ఎస్యూఐ ఓయూ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకాష్ యాదవ్, నాయకులు సుమంత్, నగేష్, శేఖర్, గోపి, నవాజ్, వీరయ్య, కార్తిక్, శంకర్, సుమంత్,రుక్మత్ తదితరులు పాల్గొన్నారు.