త్వరలో కొత్త రేషన్‌ కార్డులు..

– ఇందిరమ్మ ఇండ్లనూ అందిస్తాం : సంగారెడ్డి జిల్లా జెడ్పీ సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణ-సిద్దిపేట
కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లాంటి పథకాలు త్వరలో అమలు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంఘంలో జిల్లా పరిషత్‌ చివరి సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజా రాధాకృష్ణ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఇలాగే ప్రజా జీవితంలో కొనసాగి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే రైతులకు రుణమాఫీ చేయడానికి కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని, ఇక.. విద్య, రైతాంగ, వైద్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 26 వేల స్కూళ్లకు రూ.1100 కోట్లతో అభివృద్ధి పనులు చేసి, మౌలిక వసతులు కల్పించినట్టు చెప్పారు. ఐదేండ్లు ప్రజా జీవితంలో గడిపిన జడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మెన్‌, జడ్పీటీసీ, ఎంపీపీలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్‌ వైస్‌ చైర్మెన్‌, జడ్పీటీసీ, ఎంపీపీలను మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కొత్తప్రభాకర్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి. ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, కలెక్టర్‌ మను చౌదరి సన్మానించారు.

Spread the love