నవతెలంగాణ – హైదరాబాద్ : పంజాబ్ క్రికెట్లో నూతన అధ్యాయం ఆరంభమైంది. రాష్ట్రంలోని యువ ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ‘షేర్-ఏ-పంజాబ్ టీ20 లీగ్’ను అధికారికంగా ప్రారంభించారు. ఆదివారం న్యూ చండీగఢ్లోని పీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ లీగ్ లోగోను ఆవిష్కరించారు. భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, అర్ష్దీప్ సింగ్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ లీగ్ తొలి సీజన్ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు నిర్వహించనున్నారు. ఇందులో అమృత్సర్, ఫాజిల్కా, జలంధర్, లూధియానా, మొహాలీ, బఠిండా ప్రాతినిధ్యం వహించే ఆరు ఫ్రాంచైజీలు తలపడనున్నాయి. రౌండ్-రాబిన్ పద్ధతిలో మొత్తం 27 మ్యాచ్లు జరుగుతాయి. శుభ్మన్ గిల్, అర్ష్దీప్ సింగ్లతో పాటు అభిషేక్ శర్మ, గుర్నూర్ బ్రార్, ప్రభ్సిమ్రాన్ సింగ్ వంటి స్టార్ ప్లేయర్లు ఈ టోర్నీలో సందడి చేయనున్నారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) కార్యదర్శి గుర్మీత్ సింగ్ మీత్ హేయర్, అధ్యక్షుడు అమర్జీత్ సింగ్ మెహతా ఈ లీగ్ను ఘనంగా ప్రారంభించారు.



