నలుగురు పిల్లలుంటే నో ట్యాక్స్.. ముగ్గురు పిల్లలుంటే రుణమాఫి..

నవతెలంగాణ హైదరాబాద్: ఓవైపు ప్రపంచ జనాభా నానాటికీ పెరుగుతుంటే.. కొన్ని దేశాలను మాత్రం జననాల క్షీణత సమస్య వేధిస్తోంది. ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్లతో అక్కడి యువత పెళ్లిళ్లపై అనాసక్తి చూపడంతో భవిష్యత్‌ తరం తగ్గిపోతోంది. దీంతో వలసలపై ఆధారపడాల్సి వస్తోంది. ఐరోపా దేశం హంగేరీ  ప్రస్తుతం ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది. దీంతో జనాభాను పెంచుకునేందుకు ఆ దేశ ప్రభుత్వం వినూత్న ఆలోచనలు చేస్తోంది. ఇందులోభాగంగానే ఎక్కువమంది సంతానం ఉన్నవారు జీవితాంతం ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదని స్వయంగా దేశ ప్రధానే ప్రకటించడం విశేషం.
‘‘ఐరోపాలో జననాలు చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో ఈ సమస్యకు వలసలు పరిష్కారంగా మారుతున్నాయి. జనాభాను పెంచుకునేందుకు వలసదారులను ఆహ్వానించాల్సి వస్తోంది. అందుకే మేం విభిన్న ఆలోచనలతో ముందుకొచ్చాం. కనీసం నలుగురు లేదా అంతకంటే ఎక్కువమందిని కనే మహిళలకు తమ జీవితకాలం వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు కల్పిస్తాం’’ అని హంగేరీ ప్రధాని విక్టోర్‌ అర్బన్‌  ప్రకటన చేశారు.
పెద్ద కుటుంబాలు పెద్ద పెద్ద కార్లు కొనుగోలు చేసేందుకు వీలుగా సబ్సిడీని కూడా ఇవ్వనున్నట్టు హంగేరీ ప్రభుత్వం  వెల్లడించింది. అంతేగాక, పిల్లల పెంపకం కోసం దేశవ్యాప్తంగా 21వేల క్రెచ్‌లను ప్రారంభించినట్టు తెలిపింది. ఇలాంటి మినహాయింపులతో పెండ్లిలు, కుటుంబవ్యవస్థను ప్రోత్సహించినట్టవుతుందని అక్కడి సర్కారు అభిప్రాయపడుతోంది. హంగేరీ ప్రభుత్వం గతంలోనూ ఇలాంటి బంపరాఫర్లు ప్రకటించింది. పెళ్లిళ్లు, జననాల రేటును పెంచేందుకు 2019లో ఓ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దానికింద, 41ఏండ్లు రాకముందే పెండ్లి చేసుకునే అమ్మాయిలకు 10 మిలియన్‌ ఫోరింట్స్‌ (హంగేరీ కరెన్సీ) సబ్సిడీ రుణాలు కల్పించింది. పెళ్లయిన తర్వాత ఆ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిస్తే రుణంలో మూడోవంతును మాఫీ చేస్తామని తెలిపింది. ఒకవేళ ముగ్గురు అంతకంటే ఎక్కువ సంతానం కలిగితే మొత్తం రుణాన్ని మాఫీ చేస్తామని ఆఫర్‌ ఇచ్చింది. ప్రస్తుతం హంగేరీ జనాభా 96.4లక్షలుగా ఉంది.

Spread the love