నవతెలంగాణ జార్ఖండ్ : రీల్స్ మోజులో పడి ఎంతోమంది యువత తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు తరచూ వింటూ, చూస్తూనే ఉన్నాం.. ఎన్ని ఘోరమైన ఘటనలు జరుగుతున్నా… ఇంకా చాలామంది ఆ రీల్స్ మోజులో పడి తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. జార్ఖండ్లోని గఢ్వా జిల్లాకు చెందిన ధీరజ్సింగ్ కుమార్తె పూర్ణిమ కుమారి (19) అనే యువతి తన స్నేహితులతో కలిసి రీల్స్ చేయడానికి బయలుదేరింది. గఢ్వా పోలీస్స్టేషన్ పరిధిలోని జోబరీయా గ్రామం వద్ద ఉన్న రైల్వే ట్రాక్ సమీపానికి చేరుకుని, ఫోన్లో వీడియో షూటింగ్ ప్రారంభించారు.
కెమెరా ముందు నటిస్తూ వీడియో తీయడంలో మునిగిపోయిన పూర్ణిమ… తన వెనుక వైపు నుంచి అత్యంత వేగంగా వస్తున్న రైలును గమనించలేకపోయింది. అప్పటికే ట్రాక్పై ఉన్న ఆమెను రాంచీ నుంచి చోపన్ వెళుతున్న రైలు బలంగా ఢీకొట్టింది. ఈ అనుకోని ప్రమాదంతో అక్కడే ఉన్న స్నేహితులు షాక్కు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్నేహితులు తీవ్రంగా గాయపడిన పూర్ణిమను గఢ్వా సదర్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన రక్తస్రావం కావడం వల్ల ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
బాధితురాలికి అత్యవసర మెరుగైన చికిత్స అవసరం కావడంతో, ఆమెను మరో పెద్ద ఆసుపత్రికి తరలించాల్సిందిగా సిఫార్సు చేసినట్లు గఢ్వా సివిల్ సర్జన్ జాన్ ఎఫ్. కెన్నెడీ తెలిపారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రీల్స్, వీడియోల కోసం రైల్వే ట్రాక్లు, కొండచరియలు వంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రజలను, ముఖ్యంగా యువతను అధికారులు హెచ్చరిస్తున్నారు.


