నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో గురువారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఒక ట్విన్ ఇంజిన్ శిక్షణ విమానం గంగా నది సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న పైలట్, కో-పైలట్ ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
శిక్షణలో భాగంగా గగనతలానికి ఎగిరిన ఈ విమానం, కొద్దిసేపటికే సాంకేతిక లోపం లేదా ఇతర కారణాలతో నియంత్రణ కోల్పోయి నేరుగా పొలాల్లో కూలిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన పైలట్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ కుటుంబాలకు ఈ తీరని లోటును భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు. కాగా, ప్రమాద కారణాలపై అధికారులు ఇప్పటికే సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.



