
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : ప్రజలు చేసుకున్న దరఖాస్తులు పెండింగ్ లేకుండా , ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం రాజాపేట , తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల తాహశీల్దార్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.ధరణి లో తప్పుడు రిపోర్ట్ పంపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.మండల సర్వేయర్ వద్ద సర్వే కోసం వచ్చిన అప్లికేషన్ లను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా వెంట వెంటనే పరిష్కరించి ప్రజలకు అందించాలన్నారు.రేషన్ కార్డు ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను త్వరితగతిన ఎంక్వయిరీ చేసి దరఖాస్తుదారులకు అందించే విధంగా చూడాలని ఆదేశించారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేసి అర్హులైన లబ్ధి దారులకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఎంపీడీఓ కి ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇండ్లలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నాణ్యత ప్రమాణాలు లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస పథకం ఈ నెల 14 వ తేదిన గడువు ముగియునందున్న ప్రజలకు అవగాహన కల్పించి లబ్ధింపొందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ దేశ్యా నాయక్, సంబంధిత అధికారులకు పాల్గొన్నారు.