– అసెంబ్లీలో బడుగులకు స్థానమివ్వరా…
– మంత్రి పొన్నంకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటు చేయాలని రాజకీయాలకతీతంగా కోరుతుంటే రాజకీయ రంగు ఎందుకు పులుముతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. భారత జాగృతి సంస్థ కోరడమే అభ్యంతరమా? లేక ఫూలే విగ్రహం ఏర్పాటు చేయడమే అభ్యంతరమా?అని ఎక్స్ వేదికగా సోమవారం ఆమె అడిగారు. అసెంబ్లీలో బడుగులకు స్థానమివ్వరా?అని నిలదీశారు. స్ఫూర్తిదాయక వీరులకు కాంగ్రెస్ ఇచ్చే గౌరవం ఇదేనా?అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జాగృతి సంస్థ ద్వారా పోరాటం చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించామని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఫూలే విగ్రహ ఏర్పాటు కోసం రాజకీయాలకతీతంగా మరో పోరాటాన్ని సాగిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో రాజకీయాల కోసం సంకుచిత మనస్తత్వంతో ఈ మహాకార్యాన్ని అవహేళన చేయరని ఆశిస్తున్నానని అన్నారు. ఫూలే మహాన్నతుడనీ, అణగారిన వర్గాల్లో చైతన్యం నింపిన మహామనిషి అని చెప్పారు. ఏప్రిల్ 11 నాటికి ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని ఆమె కోరారు.