నవతెలంగాణ-హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ మృతి తనను ఎంతగానో కలచివేసిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. డీఎస్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. డి.శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ ప్రగతినగర్లోని ఆయన నివాసానికి పార్థీవదేహాన్ని తరలించారు.