రేపు వాయనాడ్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక పర్యటన

నవతెలంగాణ-హైదరాబాద్ : వాయనాడ్ లో కొండచరియలు విరిగిపడి వందలామంది మృత్యువాతపడడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కదిలిపోయారు. ఆయన మొన్నటివరకు వాయనాడ్ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలి ఎన్నికల్లోనూ వాయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచారు. అదే సమయంలో, రాయ్ బరేలీ నుంచి కూడా గెలవడంతో, ఆయన వాయనాడ్ ను వదులుకుని, బరేలీ ఎంపీగా కొనసాగుతున్నారు. తనను ఎంతగానో అభిమానించే వాయనాడ్ ప్రజలకు ఇలాంటి దుస్థితి రావడం పట్ల రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రేపు (ఆగస్టు 1) తన సోదరి, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో కలిసి వాయనాడ్ లో పర్యటించేందుకు వస్తున్నారు. నేరుగా బాధితులతో మాట్లాడనున్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా చెల్లాచెదురైనవారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించనున్నారు. తమ పర్యటనలో భాగంగా రాహుల్, ప్రియాంక మూడు పునరావాస శిబిరాలను సందర్శించనున్నారు. బాధితులకు తమ సంఘీభావం తెలిపి, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు.

Spread the love