కొనసాగుతున్న బదిలీల ప్రక్రియ

– నల్గొండ లో ఇద్దరు జిల్లా అధికారుల బదిలీ
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. గత రెండు రోజుల క్రితం ఐదుగురు తాసిల్దార్లను బదిలీ చేసిన రాష్ట్ర  ప్రభుత్వం, ఆదివారం జిల్లాలోని 28 మంది ఎంపీడీవోలను బదిలీ చేసింది. తాజాగా సోమవారం నల్లగొండ డిఆర్డిఏ పిడి కాలిందిని ని ఆదిలాబాద్ జడ్పీ డిప్యూటీ సీఈఓ గా, నల్లగొండ డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డిని యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పి డిప్యూటీ సీఈవో గా  బదిలీ  చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో డిఆర్డిఏ పీడిగా ప్రస్తుతం పనిచేస్తున్న టి. నాగిరెడ్డిని నల్లగొండ పీడీగా, నారాయణపేట డిపిఓగా పనిచేస్తున్న కాషా మురళిని నల్లగొండ డిపిఓ గా నియమించింది. అయితే ఇవే కాకుండా ఈనెల 15 వరకు మరి కొంతమంది జిల్లా అధికారులు బదిలీ అయ్యే అవకాశం ఉంది. సొంత జిల్లాలో పనిచేసే వారిని, ఒకే చోట మూడు సంవత్సరాలు పనిచేస్తున్న వారిని, జూన్ లోపు రిటైర్డ్ అయ్యే వారిని ప్రభుత్వం బదిలీ చేయనుంది. బదిలీ అయ్యే జిల్లా అధికారుల్లో హౌసింగ్ పిడి రాజ్ కుమార్, ఐసిడిఎస్ పిడి కృష్ణవేణి, సిపిఓ బాలశౌరి  ఇంకా మరి కొంతమంది ఉన్నట్లు తెలిసింది.

Spread the love