వసతి గృహ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి

Adilabad– ఐటీడీఏ పీఓ ఖుష్బూగుప్తా
నవతెలంగాణ-ఇంద్రవెల్లి
ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటీడీఏ పీఓ ఖుష్బూగుప్తా అన్నారు. శుక్రవారం మండలంలోని ఆశ్రమ పాఠశాలను పీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల హాజరు, స్టాక్‌ రిజిస్టార్లను పరిశీలించారు. ఈ సందర్బంగా పీఓ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషక విలువలు గల పచ్చి ఆకు కూరగాయల ఆహారంతో పాటు గుడ్లు, పాలు రాగి మాల్టా అందించాలన్నారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలన్నారు. నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు భోదించారు. సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని ఉపాధ్యాయులకు సూచించారు. వర్షాల నేపథ్యంలో దోమల వలన వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా, వసతి గృహ పరిసరాలలో వర్షపు నీరు నిలువకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ అజ్మీరా సాకేత్‌ కుమార్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love