ఈనెల 24న రఘువీర్ రెడ్డి నామినేషన్

– పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలి
– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ఈనెల 24న నామినేషన్ వేస్తారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్గొండ పట్టణంలో క్లాక్ టవర్ సెంటర్లో ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డితో కలిసి మంత్రి మాట్లాడుతూ.. నామినేషన్ రోజున ఉదయం 9 గంటలకు నల్గొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 12 గంటలకు నామినేషన్ వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలిపారు. ముఖ్య నాయకులంతా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. ఈనెల 20 నుంచి పార్టీ శ్రేణులంతా ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపు కోసం ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 సీట్లు గెలిపించుకోవాలని తెలిపారు.కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, పేదలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. ఉపాధి హామీ లాంటి పథకం పెట్టి, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని అన్నారు. రఘువీర్ రెడ్డి గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా కష్టపడి పని చేయాలని కోరారు. నామినేషన్ కార్యక్రమానికి పార్లమెంటు కో-ఆర్డినేటర్, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాలు నాయక్, పద్మావతి, లక్ష్మారెడ్డి, జైవీర్ రెడ్డిలు, ముఖ్య నాయకులంతా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, నల్గొండ జడ్పిటిసి  వంగూరి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, పలువురు కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Spread the love